
స్వచ్ఛందంగా కదిలిన రైతులు
భట్టిప్రోలు (కొల్లూరు): కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు రైతులు స్వచ్ఛందంగా కదిలారు. వైఎస్సార్ సీపీ నాయకులు వారికి అండగా నిలిచారు. పనులను అడ్డుకునేందుకు కూటమి నేతలు విఫలయత్నం చేశారు. అయితే రైతులు ప్రతిఘటించడంతోపాటు పోలీసుల జోక్యంతో కూటమి నేతలు వెనుదిరిగారు. అనంతరం భట్టిప్రోలు మండలం అద్దేపల్లి డ్రెయిన్లో గుర్రపు డెక్క తొలగింపు పనులు సోమవారం కొనసాగాయి.
ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వరికూటి
గుర్రపు డెక్క కారణంగా ఏడాది కాలంగా పంటలు కోల్పోతున్నామంటూ రైతులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు వద్ద మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన పదిహేను రోజుల కిందట తొలిసారి అద్దేపల్లి – గూడవల్లి డ్రెయిన్ను పరిశీలించారు. గుర్రపు డెక్క, తూటికాడలతో నిండిపోయిన డ్రెయిన్లో పనులు చేపట్టాలని కోరుతూ కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పది రోజుల వ్యవధిలో పనులు చేపట్టని పక్షంలో అదే ప్రాంతంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో వరికూటి చివరకు డ్రెయిన్ వద్దే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న డ్రెయినేజీ విభాగం అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కూటమి ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మిన్నకుండిపోయారు. దీనిపై ప్రశ్నించేందుకు వరికూటి రేపల్లెలోని కార్యాలయానికి చేరుకున్నారు. దీనిపై అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు దిగారు. కూటమి నాయకుల ఒత్తిడితో పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసుస్టేషన్కు తరలించి విచక్షణారహితంగా దాడి చేశారు. నాలుగు రోజులుగా రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వరికూటి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయినా ప్రభుత్వం స్పందించ లేదు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు నిర్ణయించుకున్నారు. స్వచ్ఛందంగా గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు పనులు చేపట్టారు.
అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు పనులను అడ్డుకునేందు కూటమి నాయకులు విఫల యత్నం రైతులు ప్రతిఘటించడంతో వెనుదిరిగిన కూటమి నేతలు
పనులను అడ్డుకునేందుకు
కూటమి నాయకుల యత్నాలు
రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన గుర్రపు డెక్క పనులను కూటమి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. రైతులు, వైఎస్సార్ సీపీ నాయకుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకున్నారు. కూటమి నాయకులను అక్కడ నుంచి వెనక్కి పంపారు. అనంతరం తూటికాడ, గుర్రపు డెక్క తొలగింపు పనులు కొనసాగాయి. పొక్లెయిన్కు తోడు ఆప్రాంత రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు కాలువలో దిగి గుర్రపుడెక్క, తూటికాడ తొలగించారు.

స్వచ్ఛందంగా కదిలిన రైతులు