సాక్షి, మదనపల్లె: నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతలు ధ్వజమెత్తారు. దగా డీఎస్సీ రద్దయ్యేదాకా పోరు ఆగదని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభా గం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం జరిగింది. శుక్రవారం మదనపల్లె అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెగా డీఎస్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఎస్సీ ఎంపికల విషయంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష పేరుతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 3.36 లక్షల మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తే, మెరిట్ లిస్టులు బయటపెట్టకుండా, అభ్యర్థుల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం వెనుక ఉన్న కుట్ర దాగుందని ఆరోపించారు. అర్ధరాత్రి వేళ డేటాబేస్ నుంచి ప్రతిభావంతులైన అభ్యర్థుల వివరాలను ఎందుకు డిలీట్ చేశారు, సెలెక్టెడ్ అని మెసేజ్ పంపి, ఆ తర్వాత మార్కులు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించడం, ఆ ఉద్యోగి జిల్లా టాపర్గా, జోన్–2 ర్యాంకర్ అవ్వడం పేపర్ లీక్ ముందే జరిగిందని అర్థమవుతోందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఒక్కొక్కరినుంచి ఒక్కో పోస్టును రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్ మాట్లాడుతూ మైదానంలో అడుగుపెట్టని ఆటగాళ్లకు బోగస్ సర్టిఫికేట్లతో డీఎస్సీలో టీచర్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. మూడు పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థికి కేవలం ఒక్క పోస్టుకే కాల్ లెటర్ పంపి దాదాపు నాలుగు వేల మంది ఉన్నత ఉద్యోగ అవకాశాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత పోస్టులు ఇవ్వాలి అని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా వాటిని బేఖాతర్ చేశారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి న్యాయవ్యవస్థనే మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేసిన డీఎస్సీ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ చేశారు. విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని చంద్రబాబు, లోకేష్ భయపడుతున్నారని అన్నారు. ఈకుంభకోణానికి బాధ్యత వహించి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్, మదనపల్లి అధ్యక్షులు అశోక్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి హేమంత్, తంబలపల్లె నియోజవర్గం అధ్యక్షులు అభిలాష్రెడ్డి, పీలేరు నియోజకవర్గం అధ్యక్షు లోకనాథం, జిల్లా కార్యదర్శి పూర్ణచంద్ర, నాయకులు గిరీష్ , సీనియర్ విద్యార్థి విభాగం, ద్వారకనాథ్ రెడ్డి, పీలేరు భువనేశ్వర్ రెడ్డి , లోకనాథ్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు పీలేరు చిన్న, నిమ్మలపల్లి మండల అధ్యక్షులు ప్రశాంత్, జిల్లా కార్యదర్శి ఆఫ్రిత్ , సీనియర్ విద్యార్థి విభాగం నాయకులు షేక్ మౌలాలి , కొండ వెంకటరమణారెడ్డి , రావూరి హరికృష్ణ పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతలు డిమాండ్
మదనపల్లెలో వైఎస్సార్సీపీ విద్యార్థి పోరు


