పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లు పంచాయతీ చలిమామిడివారిపల్లికి చెందిన వెంకట్రమణారెడ్డి (65) అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనం గత ఏడాది అపహరణకు గురైన విషయం పాఠకులకు తెలిసిందే. అప్పటి ఎస్ఐ హరిహర ప్రసాద్ చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన పుంగనూరు మండలం చండ్రమాకులపల్లికి చెందిన నిందితుడు పులి వెంకటరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి తంబళ్లపల్లె కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం జరిగిన తుది విచారణలో నిందితుడు చోరీకి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో సివిల్ జడ్జి ఏ. ఉమర్ ఫరూక్ ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్ఐ పరమేశ్ నాయక్, కోర్టు కానిస్టేబుల్ బావాజాన్లు పేర్కొన్నారు.


