చిన్నమండెం : జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ‘జలధార– జలహారతి’ కార్యక్రమాన్ని మిషన్ మోడ్లో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. నేటి నుంచి జులై 14 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించినట్లు వెల్లడించారు. చిన్నమండెం మండలం కేశాపురం పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపల్లి గొలుసుకట్టు చెరువు వద్ద సోమవారం ఘనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాన సమస్యలపై సమగ్ర అధ్యయనం చేపట్టగా నీటికొరత అత్యంత తీవ్రమైన సమస్యగా గుర్తించామన్నారు. పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు లేని జిల్లాలో చిన్న చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నీటినిల్వ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జలధార కార్యక్రమం విజయవంతం కావాలంటే సాగునీటి సంఘాలు, రైతులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులతో కలిసి రెడ్డివారిపల్లి గొలుసుకట్టు చెరువును సందర్శించి చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటరత్నం, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ విఠల్ప్రసాద్, రిటైర్డ్ ఎస్ఈ వెంకట్రామయ్య, జల వనరుల శాఖ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


