పులివెందుల : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనారోగ్యశ్రీగా మారుస్తున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు రూ.3వేల కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించలేదన్నారు. దీంతో వారం రోజులుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె ప్రకటించి ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు అందించడం లేదన్నారు. దీంతో పేద ప్రజలు వైద్య చికిత్సలు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు నిలిచిపోవడంతో పేద ప్రజలు వైద్య సేవలు పొందడానికి అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. ఇప్పటికే మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయాలనుకుంటున్న చంద్రబాబు ఆరోగ్య పథకాన్ని కూడా అటకెక్కించాలని చూడటం దారుణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని జగనన్న రూ.5లక్షల నుంచి రూ25లక్షలకు పెంచారని గుర్తు చేశారు. అమరావతికి పెట్టే ఖర్చులో ఒక్క శాతం నిధులను ఖర్చు చేసినా రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు పూర్తవుతాయన్నారు. కేవలం 29గ్రామాల రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు అమరావతి పేరుతో రూ.2లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు అమరావతి పేరుతో కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి పేరుతో నాటకాలాడుతున్నారని విమర్శించారు. జగనన్న ప్రతిపాదించిన ‘మావిగన్’ సమన్యాయం చేస్తుందన్నారు. కానీ తమ ఎల్లో మీడియా ద్వారా టీడీపీ నాయకులు విష ప్రచారం చేయటం సిగ్గు చేటన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి


