వాల్మీకిపురం : అతివేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్ను ఢీకొన్న సంఘటన మంగళవారం సాయంత్రం మండల పరిధి విఠలం సమీపంలోని హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. మండలంలోని చింతపర్తి నుంచి వాల్మీకిపురానికి ట్రాక్టర్ వెళ్తుండేది. చైన్నె నుంచి బళ్లారికి కారులో కౌషిక్ వెళ్తున్నాడు. అతివేగంగా కారు నడపడంతో అదుపు చేయలేక ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా, కారు ఇంజిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తప్పిన పెనుప్రమాదం
తెగని రక్షణ గోడ పంచాయితీ
– పనుల కోసం టీడీపీలో వర్గపోరు
పెద్దమండ్యం : పెద్దమండ్యం ఉన్నత పాఠశాల వద్ద రక్షణ గోడ నిర్మాణ పనుల పంచాయితీ తెగడం లేదు. పనులు చేపట్టడంలో టీడీపీలో వర్గపోరు నెలకొంది. వివరాలలోకి వెళితే.. పాఠశాల గేటు వద్ద రక్షణగోడ దెబ్బతిన్న చోట.. కొత్తగా గోడను నిర్మించేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో నిధులు మంజూరయ్యాయి. ప్రహరీ దెబ్బతిన్న చోట బాలికల మరుగుదొడ్లు ఉండటంతో మహిళా ప్రజాప్రతినిధులైన ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, జెడ్పీటీసీ పీరాంబి జెడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దెబ్బతిన్న ప్రహరీని జెడ్పీ సీఈవో పరిశీలించి చైర్మన్కు నివేదించారు. దీంతో రూ. 5 లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టేందుకు పెద్దమండ్యం సర్పంచ్ సోదనపల్లె బాసా దెబ్బతిన్న గోడను తొలగించారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో పనులు చేపట్టకుండా నిలిపేశారు. కాగా ప్రహరీ నిర్మాణం పనులు చేపట్టేందుకు టీడీపీలో ఒక వర్గం వారు ఇటీవల ఇసుక, కంకర తోలారు. పనులు చేపట్టేందుకు మంగళవారం జేసీబీతో గుంతలు తీస్తుండగా.. టీడీపీకి చెందిన మరో వర్గం వారు అభ్యంతరం తెలిపారు. పాఠశాల కమిటీ చైర్మన్కు తెలియకుండా పనులు చేస్తున్నారని అడ్డుకున్నారు. ఈ విషయమై రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పనులు చేపట్టకుండా జేసీబీ వెనక్కి వెళ్లిపోవడంతో.. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా బాలికల మరుగుదొడ్లు ఉన్న చోట ప్రహరీ దెబ్బతినడం, వర్గపోరుతో పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులపై అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాల పదో తరగతి పరీక్షల నిర్వహణ కేంద్రం కావడంతో రక్షణ గోడ లేకపోతే అల్లరి మూకలతో ఇబ్బందులు తప్పవు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.


