చస్తేనే పెన్షన్
బాబు జమానాలో చస్తేనే పింఛన్
మదనపల్లె: చంద్రబాబు జమానాలో పేదల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో పింఛన్ తీసుకుంటున్న వారిలో ఒకరు చనిపోతే తప్ప మరొకరికి వచ్చేది కాదు. పరిస్థితులు మారిపోతున్నాయి, అన్ని రంగాల్లోనూ, ప్రభుత్వ పాలన తీరులోనూ, సంక్షేమ ఫలాలు అందించాల్సిన విషయంలోనూ శరవేగమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు పాలనలో పెన్షన్ మంజూరు వ్యవహారంలో మాత్రం పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. దీని ఫలితంగా జిల్లాలో అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా దక్కుతుందన్న ఆశలు ఆవిరి అయిపోతున్నాయి. తమకు పింఛన్లు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు. కూటమి పాలన అధికారంలోకి వచ్చి 21 నెలలైనా 21 పెన్షన్లు మంజూరు చేయలేకపోయింది.
వేల దరఖాస్తుల తొలగింపు
జిల్లాలో వైఎస్.జగన్ పాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన వారు పెన్షన్లు పొందడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లు 2024 జూన్ వరకు అందిన పింఛన్ల దరఖాస్తులను సచివాలయ పోర్టల్ లో ఆన్లైన్ చేశారు. జిల్లాలో ఇలా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. కూటమి పాలన రాగానే దరఖాస్తుల స్వీకరణ ఆపివేయడంతోపాటు.. అప్పటిదాకా నమోదు చేసుకున్న దరఖాస్తుల మొత్తాన్ని ఆన్లైన్ నుంచి తొలగించారు. దీంతో దరఖాస్తులు వివరాలు అందుబాటులో లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హులైన పెన్షన్లు మంజూరు చేస్తూ వచ్చారు. దీనివల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడలేదు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకుండా పోయింది. దరఖాస్తు చేసుకున్నా వివరాలు ఇప్పుడు అందుబాటులో లేవు.
అర్హుల ఎదురుచూపు
భరోసా పెన్షన్ల కోసం అర్హులైన వారు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్లే ఇప్పటికి కొనసాగువుతున్నాయి. జిల్లాలో 26 రకాల పెన్షన్లు 1,89,019 మందికి అందిస్తున్నారు. వీటిలో కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది ఒకటి కూడా లేదు. అయినప్పటికీ ఈ పింఛన్ల ఘనత తనదే అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. అరులైన వారు మండల పరిషత్, మున్సిపాలిటీలు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగిలా తిరుగుతున్నా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తోంది.
ఉన్నదాంట్లో కోత వేశారు
సాధారణంగా పింఛన్లను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తుండాలి. అయితే కూటమి ప్రభుత్వమేమో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లకే ఎసరు పెట్టింది. 2024 జూన్లో జిల్లాలో 2,23,436 పింఛన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంపిణి చేసింది. కూటమి ప్రభుత్వం రాకతో ఈ సంఖ్య ప్రస్తుతం 1,89,019కి తగ్గించేశారు.
చంద్రబాబు కూటమి పాలనలో పెన్షన్ పొందాలంటే ఒకరు చావాల్సిందే. అది కూడా భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకిస్తారు. 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించలేదు. పెన్షన్లు కావాలని తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిపై ఆలోచించలేదు. ఒక ఆలోచన మాత్రం చేసింది.. అదేమంటే భర్త చనిపోతే, అదే పెన్షన్ భార్యకి ఇవ్వడం. ఇదే ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భరోసా. జిల్లాలో దీన్ని 2024 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నారు. కుటుంబంలో పెద్దయిన భర్త చనిపోతే వారి స్థానంలో పెన్షన్ కోసం భార్యలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. దాని ఫలితంగా ప్రతినెల వితంతువులు దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో 2024 డిసెంబర్ నుంచి 2026 మార్చి వరకు 7,290 పింఛన్లు భార్యలకు మంజూరు చేశారు. 2025 మే, జూన్లో ఈ పింఛన్లు ఒక్కటి మంజూరు చేయలేదు. కాగా ఇచ్చిన ఈ పింఛన్లు భర్తలు చనిపోవడంతో వారి భార్యలకు బదలాయించారు తప్ప కొత్తవికావు. అందులోనూ ఈ పింఛన్లు మంజూరు చేసింది కూడా కూటమిపాలలో కాదు. మాజీ సీఎం వైఎస్.జగన్ పాలన ఉన్నప్పటి నుంచి వస్తున్నవే. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు.
2024 జూన్ నుంచి కొత్తవి లేవు
డిసెంబర్ నుంచి భర్త చనిపోతేభార్యకు పింఛన్
మరణించిన భర్తలకు పింఛన్ ఇచ్చింది జగనన్న పాలనలోనే


