రామసముద్రం: మండలంలోని కాప్పల్లి పంచాయతీ నల్లచిన్నేపల్లిలో కలుషిత ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించి గ్రామస్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు. వాటిని తిన్న ప్రజలకు ఫుడ్ పాయిజన్ (కల్తీనూనెతో) జరిగి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పలువురుకు టైఫాయిడ్ జ్వరం రావడంతో మదనపల్లి, చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందారు. గ్రామంలో పవిత్ర, వెంకటేష్ రాజు, వాణి, రెడ్డెమ్మ, రెడ్డి ప్రసాద్ లతో పాటు మరో 15 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ జాహ్నవి, నాగరాజు ఆధ్వర్యంలో వైద్య బృందం శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలకు రక్త పరీక్షలు చేసి మందులు, మాత్రలు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.36 మందికి చికిత్స చేయగా, 5మందికి వాంతులు, విరోచనాలు, ఐదుగురికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఎనిమిది మందికి చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాచి వడపోసిన నీటిని తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు వైద్యులు అవగహన కల్పించారు.
20 మందికి వాంతులు, విరోచనాలు,
ఐదుగురికి జ్వరాలు
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు


