జగనన్న కాలనీ పక్కనే ఉన్న మిడిమాలపు కొండలో ఎగసి పడుతున్న మంటలు
చిట్టిబోయనపల్లె సమీపంలోని మిడిమాలపు కొండలో కాలిబూడిదైన వృక్ష సంపద
గుర్రంకొండ : గుర్రంకొండ పట్టణంలోని మిడిమాలపు కొండలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక జగనన్న కాలనీ పక్కనే ఉన్న మిడిమాలపు కొండతోపాటు పరిసరాల్లోని గుట్టలు రెండు రోజుల పాటు తగలబడ్డాయి. కొండకు దగ్గర పెద్ద ఎత్తున కాలనీ వాసులు నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. రెండు రోజులుగా దుండగులు కొండలకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు ఎగసి పడుతూ రాత్రిళ్లు కొండలు మొత్తం కాలిబూడిదయ్యాయి. దీంతో ఓ వైపు మంటలు, మరోవైపు దట్టమైన పొగతో కొండలకు దిగువభాగంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీతోపాటు సుంకరవాండ్లపల్లె, చిట్టిబోయనపల్లె గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాల వారు ఇబ్బందులకు గురయ్యారు. రాత్రంతా ఎక్కడ మంటలు కింది వైపునకు వస్తాయోనని ప్రజలు జాగారం చేశారు. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతూ చెట్లను కాల్చి బూడిద చేశాయి. ఈ మంటల ధాటికి అడవి జంతువులు, పక్షులు ఎక్కడికి వెళ్లలేక మంటల్లో చిక్కుకొని కాలిపోయాయి. పలువిషసర్పాలు మంటల ధాటికి కొండ దిగువభాగంలో ఉన్న జనవాసాల మధ్యలో చొరబడ్డాయి. కావాలనే కొంత మంది దుండగులు కొండలకు, గుట్టలకు నిప్పుపెట్టడంతో వందలాది ఎకరాల అటవీ ప్రాంతం కాలిబూడిదయ్యిందని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది.


