రొంపిచెర్ల : రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని లక్ష్మీనారాయణ కాలనీలో ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను కొందరు అమ్ముకున్నారని మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు దొరబాబు నాయుడు ఆరోపించారు. ఆయన మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదలకు గత టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల పాలనలో సర్వే నెంబరు 1605–1,1606–2 లో సుమారు 172 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. అయితే ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులు సుమారు 100 ఇళ్లు కాజేసి ఇతరులకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు 20 నెలల కాలంలో ఐదు సార్లు ఫిర్యాదు చేశామన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలోకి వచ్చి తన ఆస్తులను కాపాడుకుంటున్నారని ఆరోపించారు. నా భార్య పేరుతో ఇచ్చిన ఇంటి పట్టాను కూడా విక్రయించారని చెప్పారు. ఇళ్ల పట్టాల దుర్వినియోగంపై ఇన్చార్జి తహసీల్దార్ కిరణ్కుమార్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు. తూతూమంత్రంగా విచారణ జరిపి రెండు ఇళ్లకు పట్టాలు ఇవ్వలేదని గుర్తించి వాటికి నోటీసు బోర్డులను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు. విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు. లక్ష్మీనారాయణ కాలనీలో జరిగిన ఇళ్ల పట్టాల దుర్వినియోగంపై ఫిర్యాదు చేస్తే ‘నీ అంతు చూస్తాం’ అని కొందరు బెదిరిస్తున్నారని విలపించారు. న్యాయం జరిగే వరకు పొరాటం చేస్తామని తెలిపారు. న్యాయం జరగకపోతే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లతానని చెప్పారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
విచారణ చేసి దోషులను శిక్షించాలి
టీడీపీ నేత దొరబాబు నాయుడు


