
అధికారమే అండ.. కరుగుతున్న కొండ
అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతూ కొండలను కరగదీస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే భారీ పేలుళ్లకు పాల్పడుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట ముగ్గురాయి ఖనిజం వంద మీటర్లలోపు భారీస్థాయిలో డ్రిల్లింగ్ నిర్వహించి స్థానిక టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నాడు. జాతీయ రహదారి పక్కనే భారీ పేలుళ్లకు అనుమతులు అధికారులు ఎలా ఇచ్చారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిర్వహించిన బ్లాస్టింగ్తో పెద్ద శబ్దాలు రావడంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దుమ్ము, దూళితో దట్టమైన పొగలు అల్లుకున్నట్లు ఉండటంతోపాటు రాళ్లు తమపైన పడతాయోమేనని భయాందోళన చెందుతున్నారు. ఈ పేలుళ్లధాటికి గతంలో కొండపై నుంచి బండరాయి జాతీయ రహదారిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఏపీఎండీసీ అధికారులు బండరాయిని తొలగించారు.
డేంజర్ జోన్లో ఎలా అనుమతిస్తారు?
మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి 500 మీటర్ల వరకు డేంజర్ జోన్గా ప్రకటించారు. అయితే వందమీటర్ల లోపు భారీ ఎత్తున డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ ఎలా అనుమతించారని, అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏ విధంగా చూస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీఎండీసీ అధికారులు ఐదువందల మీటర్ల డేంజర్ జోన్లో ఈ కంకర మైనింగ్కు ఏ విధంగా అధికారులు మినహాయింపు కల్పించారని ప్రశ్నిస్తున్నారు.
గ్రామాల ప్రజలు ఆందోళన
జాతీయ రహదారి పక్కనే మైనింగ్లో పెద్దఎత్తున కంప్రెసర్తో ప్రస్తుతం బ్లాస్టింగ్ కోసం పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. బ్లాస్టింగ్ నిర్వహిస్తే ఏమి జరుగుతుందోనని సమీప గోవిందంపల్లి గ్రామ ప్రజలు, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీఎండీసీ నుంచి వచ్చే వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడుతుంటే.. కంకర క్వారీ కోసం అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉండటంతో కాలుష్యం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని గోవిందంపల్లి గ్రామ ప్రజలు గతేడాది నుంచి అధికారులకు మెరపెట్టుకుంటున్నారు. దీంతో అప్పటి జిల్లా ఎస్పీ బ్లాస్టింగ్కు అనుమతి ఇవ్వలేదు. ఆయన బదిలీపై వెళ్లగానే స్థానిక టీడీపీ నాయకుడు మరలా పెద్దఎత్తున బ్లాస్టింగ్ నిర్వహించేందుకు పనులు చేస్తున్నాడు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
ఇలాగే బ్లాస్టింగ్ కారణంగా బద్వేలు నియోజకవర్గం కలస్పాడులో అనేక మంది మృతి చెందారు. ఇటువంటి బ్లాస్టింగ్ల ద్వారా ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారని గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రస్తుతం కంకర కోసం అక్రమంగా బ్లాస్టింగ్ చేసేందుకు నిర్వహిస్తున్న పనులను అడ్డుకోవాలని గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
మంగంపేట ఏపీఎండీసీ గనుల సమీపంలో అక్రమ మైనింగ్
జాతీయ రహదారి పక్కనే పెద్ద ఎత్తున లేచిన దుమ్ము దూళీ
మంగంపేట గనుల సమీపంలో అక్రమ మైనింగ్
జాతీయ రహదారి పక్కనే పేలుళ్లు
ఆందోళనలో ప్రయాణికులు, సమీప గ్రామస్తులు
పట్టించుకోని అధికారులు

అధికారమే అండ.. కరుగుతున్న కొండ