
లక్కిరెడ్డిపల్లెలో టెన్షన్..టెన్షన్..
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా టీడీపీ, వైఎస్సార్పీ శ్రేణులు మోహరించడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయం నెలకొంది. సీఎం చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే సమాచారంతో మంత్రి అనుచరులు రమేష్రెడ్డి ఇంటి పైన దాడికి వస్తున్నట్లు నియోజకవర్గ వ్యాప్తంగా సమాచారం వ్యాపించింది. దీంతో రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు రాయచోటి మండలాల్లోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్కిరెడ్డిపల్లి చేరుకున్నారు. ఇదే క్రమంలో మంత్రి సోదరుడు, స్థానిక టీడీపీ నేతలు రావిచెట్టు వైపు నుంచి భారీ వాహన కాన్వాయ్ తో చేరుకున్నారు. ఇరు వర్గాల మోహరించారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే నెపంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డిపై లక్కిరెడ్డిపల్లె టీడీపీ నాయకుడు మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి సీఐ వెంకట కొండారెడ్డి తెలియజేశారు. పోలీసుల వివరాల మేరకు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా చిన్నమండెం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిలపై తప్పుగా మాట్లాడటంపై టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. రమేష్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించడంపై పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా కేసులు నమోదు చేయడం, భయబ్రాంతాలకు గురి చేయడం బాధాకరమని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి ప్రచారంతో మోహరించిన ఇరువర్గాలు
పోలీసుల అలర్ట్