
చెరువుకు చెర
టాక్స్ఫోర్స్: సాగుకు, పట్టణ ప్రజలకు పర్యాటక ప్రాంతంగా ఉన్న చెరువులను అక్రమార్కులు చెరపడుతున్నారు. రాయచోటి పట్టణ సమీపంలోని ఇనాయత్ ఖాన్ చెరువు ఆక్రమణకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సమీప బంధువులు సిద్ధమయ్యారు. మట్టి, ఇసుక మాఫియా, రియల్టర్ల దెబ్బకు చెరువులే మాయమవుతున్నాయి. పట్టణ పరిధిలో ఉన్న రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ చెరువు ఉంది. అధికారమే అండగా, సంపాదనే ధ్యేయంగా ప్రకృతి వనరులను దోచుకుతింటున్న కూటమి నాయకులు నేడు కోట్ల రూపాయలు విలువచేసే ఈ చెరువు ఆక్రమణకు సిద్ధమయ్యారు. చెరువు ఎగువ భాగాన సర్వే నంబరు. 509/2లో మిలటరీ పట్టా పేరుతో 2.5 ఎకరాల భూమిని ఆక్రమించగా సమీపంలోనే ఉన్న మరికొంత భూమిని చదును చేస్తున్నారు. ఇందుకోసం టిప్పర్లతో మట్టిని తోలారు. ఇప్పటికే చెరువులోకి పైభాగం నుంచి వచ్చే వాగులను ఆక్రమించి సిమెంటు కాంక్రిట్లతో అడ్డుకట్టలు వేసి ప్లాట్లు వేసి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
● రాయచోటి పట్టణం రింగ్ రోడ్డు పరిధిలోని పెమ్మాడపల్లి మార్గంలో ఉన్న ఇనాయత్ ఖాన్ చెరువు పట్టణానికి ఎగువ భాగంలో ఉన్న కంచాలమ్మ గండి చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నాయకులు వీటిని ఆక్రమించేందుకు సిద్ధపడటంపై స్థానికులు మండిపడుతున్నారు.
రికార్డులు మాయం
రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో డీకేటీ, మిలటరీ పట్టాలకు సంబంధించిన ప్రధాన రికార్డులు మాయమైనట్లు సమాచారం. రాయచోటి పట్టణం చుట్టూ కోట్ల రూపాయలు విలువచేసే భూములను ఆక్రమించి వాటికి నకిలీ డికేటీ పట్టాలు, నకిలీ మిల్ట్రీ పట్టాలను సృష్టించి దర్జాగా ఆక్రమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పట్టాల విషయంపై స్థానిక మీడియా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులను గతంలో పలుమార్లు ప్రశ్నించిన సందర్భంలో పట్టాలిచ్చిన రికార్డులు కనిపించడం లేదన్న సమాధానాలు ఇచ్చారు.
మిలటరీ పట్టా పేరుతో ఆక్రమణకు పాల్పడుతున్న మంత్రి బంధువులు
పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ శాఖలు