ఆరుగురు పగటి దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరుగురు పగటి దొంగలు అరెస్ట్‌

Jun 15 2025 8:23 AM | Updated on Jun 15 2025 8:23 AM

ఆరుగురు పగటి దొంగలు అరెస్ట్‌

ఆరుగురు పగటి దొంగలు అరెస్ట్‌

మదనపల్లె రూరల్‌ : తాళం వేసిన ఇళ్లను గుర్తించి, పగటిపూట దొంగతనాలకు పాల్పడే ఆరుగురు దొంగలను అరెస్ట్‌ చేసి, సుమారు రూ.20 లక్షల విలువచేసే నగలు, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. శనివారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ముదివేడు, మదనపల్లె వన్‌,టూ, తాలూకా పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన ఆరు కేసులకు సంబంధించి నిందితులను అరెస్ట్‌ చూపారు. మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌తో కలిసి డీఎస్పీ చోరీలకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ మందబండకు చెంది ప్రస్తుతం కొండామర్రిపల్లె టీఎన్‌ఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న షేక్‌ మౌలాలి అలియాస్‌ బాబు(52), కర్ణాటక చింతామణి తాలూకా జోగులగడ్డ బూరగమాకులపల్లెకు చెందిన కేఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌ కం కండక్టర్‌ ఎన్‌.శంకర(48), కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ గౌనువారిపల్లెకు చెందిన పాలెం నరసింహులు(45), మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ పాకాలవారిపల్లెకు చెందిన వరగాని నవీన్‌కుమార్‌(30), కురబలకోట మండలం తెట్టు పంచాయతీ, చింతమాకులపల్లెకు చెందిన అనంత విశ్వనాథరెడ్డి(65), చిత్తూరుజిల్లా గంగవరం మండలం మడుగూరుకు చెందిన నీరుగట్టి రమేష్‌(44)..ఆరుగురు ఓ టీ హోటల్‌లో కలుసుకున్నారు. డబ్బులు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ముదివేడు, మదనపల్లె పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పగటిపూట ద్విచక్రవాహనాలపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. కాసేపు అక్కడే రెక్కి నిర్వహించారు. ఎవరూ గమనించడం లేదని తెలుసుకుని ఇద్దరు తాళాలు పగలగొట్టి లోనికి వెళితే ఇద్దరు ఇంటి వద్ద, మిగిలిన ఇద్దరు వీధి ప్రారంభంలో కాపలా కాసేవారు. దొంగతనం పూర్తిచేసుకుని బయటకు వచ్చాక దర్జాగా ద్విచక్రవాహనాల్లో అక్కడ నుంచి వెళ్లిపోయేవారు. దొంగతనం చేసిన నగలు, వస్తువులను కర్ణాటకలోని చింతామణిలో విక్రయించి, వచ్చిన సొమ్ములతో విలాసాలకు ఖర్చుచేయడం, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వెళ్లడం చేసేవారు.

సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా..

దొంగతనాలకు సంబంధించి ముదివేడు, మదనపల్లె పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా లభించిన వేలిముద్రలు, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నేరస్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు..శనివారం ఉదయం 7 గంటల సమయంలో కురబలకోట మండలం చేనేతనగర్‌ బస్‌స్టాప్‌ వద్దకు చేరుకోగా, అప్పటికే అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్న ఆరుగురు మగ వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని విచారించగా చేసిన దొంగతనాలను అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి సుమారు 150 గ్రాముల బంగారు నగలు, 762 గ్రాముల వెండివస్తువులు, రూ.5,28వేల రూపాయల నగదుతో పాటుగా నేరానికి ఉపయోగించిన రెండు ఇనుపరాడ్లు, ఒక స్క్రూడ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితుల్లో ఏ1 అయినటువంటి షేక్‌ మౌలాలిపై బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో రెండు ఎర్రచందనం కేసులు, ఏ4 వరగాని నవీన్‌కుమార్‌పై తాలూకా పోలీస్‌స్టేషన్‌లో అనుమతి లేకుండా ట్రాక్టర్‌లో ఇసుక తరలింపు, ఏ5 అనంత విశ్వనాథరెడ్డిపై ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో లిక్కర్‌ కేసు ఉందన్నారు. ఏ2 అయినటువంటి ఎస్‌.శంకర, కేఎస్‌ఆర్టీసీలో డ్రైవర్‌ కం కండక్టర్‌గా పనిచేస్తూ, అదనపు ఆదాయం కోసం దొంగతనాలను ఎంచుకున్నాడన్నారు. చోరీ చేసిన సొత్తును విక్రయించి నగదు చేయడంలో ముఠాలో కీలకంగా వ్యవహరించేవాడని తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచి ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ నరసింహులు, శంకర్‌, పీసీలు రాఘవరెడ్డి, శివ, శంకర, దొరబాబు, చలపతి, ముదివేడు పోలీసులు హరి, శ్రీనివాసులు, వెంకటేష్‌, కే.శ్రీనివాసులు, శాంతకుమార్‌, ప్రేమ్‌కుమార్‌, బ్రహ్మేష్‌, రాజేష్‌, రెడ్డిశేఖర్‌, సిద్ధేశ్వర్‌లను అభినందించారు.

రూ.20లక్షల విలువచేసే నగలు, నగదు, వెండి స్వాధీనం

నిందితుల్లో ఒకరు కేఎస్‌ఆర్టీసీ

డ్రైవర్‌ కం కండక్టర్‌

చోరీ వివరాలు వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement