రక్తబంధువులు | - | Sakshi
Sakshi News home page

రక్తబంధువులు

Jun 14 2025 7:23 AM | Updated on Jun 14 2025 7:25 AM

శతాధిక

రక్తదాత

పై ఫోటోలోని వ్యక్తి చిట్వేలికి చెందిన డాక్టర్‌ దొండ్లవాగు వేణుగోపాల్‌. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం బెంగుళూరులో తన తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సందర్భంగా ఆమెకు రక్తం అవసరం కావడంతో ‘రక్తం కోసం’ వేణుగోపాల్‌తో పాటు ఆయన సొదరులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, శ్రీనివాసులు నడిరోడ్డుపై బిక్షాటన చేశారు. అప్పుడు రక్తం విలువ ఏమిటన్నది వేణుగోపాల్‌ సోదరులైన చిట్వేలి మాజీ సర్పంచ్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, చిట్వేలి జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న శ్రీనివాసులు తెలుసుకున్నారు. అప్పటి నుంచి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తన తోబుట్టువులను, ఆయన పిల్లలను రక్తదాతలుగా మార్చారు. అందులో భాగంగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ 51 సార్లు రక్తదానం చేయగా, శ్రీనివాసులు 19 సార్లు రక్తదానం చేశారు. ఇప్పటి వరకు ఆయన 110 సార్లు రక్తదానం చేశారు. అలాగే వేణుగోపాల్‌ చిట్వేలి మండలంలో 458 మందిని రక్తదాతలుగా మార్చారు. వీరంతా ప్రతి మూడునెలలకో మారు రక్తదానం చేస్తుండటం విశేషం.

రాజంపేట టౌన్‌/ మదనపల్లె సిటీ : ఏ వస్తువునైనా మనిషి తన తెలివి తేటలతో తయారు చేయగలడు. డబ్బుతో వాటిని కొనుగోలు చేయగడు. కాని మనిషి రక్తాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. చాలా మందికి రక్తం అందక విలువైన ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి వారికి సకాలంలో మన శరీరంలో జీవధారగా ప్రవహించే రక్తాన్ని అందిస్తే ప్రాణాలు నిలుస్తాయి. వెలకట్టలేని రక్తాన్ని కేవలం మరో వ్యక్తి నుంచే సేకరించాలి. అందుకే రక్తదానానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం రక్తదానంపై విద్యావంతుల్లో, యువకుల్లో కొంతమేర అవగాహన పెరిగింది. అందువల్ల అవసరమైన వారికి రక్తదానం చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. రక్తదానం ఆవశ్యక్త గురించి నిరక్ష్యరాస్యులకు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం కల్పిస్తే రక్తం దొరకదు అన్నమాట వినపడదు. ఫలితంగా రక్తం దొరకక ఏ ఒక్కరు కూడా మృత్యువాత పడే పరిస్థితి ఉండదు. నేడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

రక్తదానమంటే ప్రాణాలు కాపాడటమే..

రక్తదానం అన్నది వెలకట్టలేనిది. రక్తదానం అన్న మాటను చాలా మంది తరచూ వింటూనే ఉంటారు. కాని సమయానికి రక్తం దొరక్కుంటే మనిషి ప్రాణాలను కూడా గాలిలో కలిసిపోతాయి. అదే రక్తం సరైన సమయానికి దొరికితే ఓ నిండు ప్రాణం నిలబడుతుంది. రక్తదానం అన్నది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్పదానం. రక్తం యొక్క ఆవశ్యకత గురించి చాలా మందికి తెలిసినప్పటికి ఇప్పటికి రక్తదానం చేసేందుకు చాలా మంది వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. రక్తదానం చేయడం వల్ల బలహీనత ఏర్పడుతుందన్న అపోహ చాలా మందిలో ఉంది. ఇక నిరక్ష్యరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ అపోహ బలంగానేవుంది. అయితే ఆరోగ్యవంతులు రక్తదానం చేస్తే మరింత ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రక్తదానం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

రక్తదానం వల్ల ప్రయోజనాలు

రక్తదానం వల్ల ముఖ్యంగా రోసగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తదానం చేయడం వల్ల శరీరంలో పాతరక్తం పోయి కొత్తరక్తం ఉత్పత్తి అవుతుంది. బ్లడ్‌ ప్లాస్మా కూడా పునరుజ్జీవం పొంది ల్యూకో సైట్‌ల పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ల్యూకోసైట్‌లు వివిధ అనారోగ్యాల నుంచి రక్షించే రోగనిరోధక కణాలు. ఈకారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తదానం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. క్యాన్సర్‌ వ్యాధిని దూరం చేస్తుంది. రక్తదానం చేస్తుండటం వల్ల శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే గుర్తించవచ్చు.

అరుదైన బ్లడ్‌ గ్రూపులు ఇవే..

బ్లడ్‌ గ్రూపుల్లో కొన్ని అరుదైన గ్రూపులు ఉన్నాయి. ఇందులో ఏనెగెటివ్‌, బీనెగిటివ్‌, ఏబీనెగటివ్‌, ఏబీపాజిటివ్‌ వంటి వి అరుదైన బ్లడ్‌ గ్రూపులు. ఈగ్రూపు బ్లడ్‌ కొంతమందిలోనే ఉంటుంది. ఇలాంటి బ్లడ్‌ గ్రూపుగల వారు రక్తదానం చేసేందుకు ఎప్పుడు ముందుంటే కొన్ని సమయాల్లో మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా నిలబడతాయి.

రక్తదానం కోసం వాట్సాప్‌ గ్రూపులు..

ప్రస్తుతం కొంత మంది యువకులు రక్తదానం చేసేందుకు చాలా చొరవ చూపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉండటంతో కొంత మంది సామాజిక ధృక్పదంగలవారితో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి తద్వారా అవసరమైన వారికి రక్తదానం చేయిస్తున్నారు. అంతేకాక ఎవరికై నా ఫలానా బ్లడ్‌ గ్రూపు కావాల్సివుందని వివిధ రకాల గ్రూపుల్లో మెసెజ్‌ పెట్టినా ఆ మెసెజ్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఫలితంగా అవసరమైన వారికి రక్తం అందుతుంది. అందువల్ల ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూపుల వల్ల కూడా కాస్త సులువుగానే అవసరమైన వారికి రక్తం అందుతుంది.

మొబైల్‌ ఫోన్‌నే ఓ బ్లడ్‌బ్యాంక్‌గా చేసుకోవచ్చు

మొబైల్‌ ఫోన్‌నే ఓ బ్లడ్‌బ్యాంక్‌గా కూడా సృష్టించుకోవచ్చు. అదెలా అంటే....మొబైల్‌ ఫోన్‌లో స్నేహితులు, సన్నిహితులు, బంధువుల నెంబర్‌లు ఫీడ్‌ చేసుకునే సమయంలోనే వారి బ్లడ్‌ గ్రూపు కూడా ఫీడ్‌ చేసుకుంటే అదే ఓ బ్లడ్‌బ్యాంక్‌ అయ్యే అవకాశముంది. ఎవరికై నా ఏదైనా గ్రూపుకు సంబంధించి బ్లడ్‌ అవసరం అని తెలియగానే మన మొబైల్‌ఫోన్‌లో ఆ గ్రూపుబ్లడ్‌ వారికి ఫోన్‌చేసి రక్తదానం చేసే ఏర్పాటు చేయించవచ్చు.

రక్తదానం చేసేందుకు వీరు అర్హులు

ఆరోగ్యవంతులుగా ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు వయస్సువారు రక్తదానం చేయవచ్చు.

50 కిలోల బరువు కలిగివుండాలి

హిమోగ్లోబిన్‌ శాతం 12.5 ఉండాలి

టైఫాయిడ్‌, మలేరియా ఇతర వ్యాధులు సోకిన వారు నయమైన తరువాత ఆరు నెలల అనంతరం రక్తదానం చేయవచ్చు.

రక్తదానం చేసేవారి నుంచి కేవలం 300 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు.

రక్తాన్ని సేకరించే ముందు అన్నిరకాల రక్తపరీక్షలు చేస్తారు. అలాగే వైద్యులు రక్తదాత ఆరోగ్య పరిస్తితిని పరిశీలిస్తారు.

పత్రికలో వచ్చిన కథనంతో రక్తదాతగా మారారు

పై ఫోటోలోని వ్యక్తి పేరు రాఘవరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి. 1989వ సంతవ్సరంలో రాజంపేట పట్టణ శివారుల్లోని పోలి చెరువుకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి రక్తం అందక మృతి చెందాడు. ఈవిషయాన్ని పత్రికల్లో చదివిన వెంకటేశ్వర్‌రెడ్డిని కలిచివేసింది. అప్పుడే ఎవరికి అవసరమైన రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపుగల వెంకటేశ్వర్‌రెడ్డి 20 సంవత్సరాల వయసు నుంచి రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన 64 సార్లు రక్తదానం చేశారు. అవసరమైన వారికి ఆయన రక్తదానం చేయడమే కాక తన స్నేహితులు, బంధువుల ద్వారా కూడా రక్తదానం చేయిస్తుంటారు. ఈసేవా కార్యక్రమం వెలకట్టలేని ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని ఆయన చెబుతున్నారు.

ఆపద సమయాన ప్రాణాలను

కాపాడే గొప్పదానం రక్తదానం

రక్తదానంపై యువకుల్లో

పెరిగిన అవగాహన

రక్తదానం చేసేందుకు

ముందుకు వస్తున్న యువత

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

రక్తబంధువులు 1
1/3

రక్తబంధువులు

రక్తబంధువులు 2
2/3

రక్తబంధువులు

రక్తబంధువులు 3
3/3

రక్తబంధువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement