మంత్రి లోకేశ్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలు ఫైనాన్స్ కంపెనీలతో కుమ్మక్కై విద్యార్థుల తల్లిదండ్రులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చదువులు పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యా సంవత్సరానికి మొదటి టర్మ్ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.
నిర్ణీత సమయంలో ఫీజులు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మెసేజ్లు పంపి మరీ విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు 6, 9 నెలల కాలపరిమితితో విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తూ ఈఎంఐల రూపంలో అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా సంస్థల ముసుగులో ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెడితే ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు.
వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ వేసి ఇలాంటివి జరగకుండా అడ్డుపడిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యను వ్యాపారం చేసి ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్కి విద్యాశాఖపై ఏమాత్రం నియంత్రణ, అవగాహన లేదని.. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


