వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు
మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
రాధాకృష్ణది జర్నలిజం కాదు.. బ్రోకరిజమని ఆగ్రహావేశాలు
వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
పలుచోట్ల లాఠీచార్జ్
ఖాకీల అరాచకంపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
మహిళలను కించపరిచేలా, సభ్యసమాజం తలదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సాక్షి నెట్వర్క్: మహిళలను కించపరిచేలా, సభ్యసమాజం తలదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘రాధాకృష్ణది జర్నలిజం కాదు. ముమ్మాటికీ బ్రోకరిజం’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారాహిత్య జర్నలిజాన్ని ఖండించారు. మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పలుచోట్ల ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట శాంతియుత ఆందోళనలు చేపట్టారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొనగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై జులుం ప్రదర్శించారు. ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అతనిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందే
విజయవాడ రామవరప్పాడు సమీపంలోని ముస్తాబాద రోడ్డులో గల ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు పెద్దపెట్టున నిరసనకు దిగారు. ‘బూతు రాధాకృష్ణ డౌన్డౌన్’ అని రాసిన ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ నేతలు, మహిళలు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయం రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. శాంతియుత నిరసన తెలియజేయడానికి మాత్రమే వచ్చామని చెప్పినా వినకుండా అనుచితంగా ప్రవర్తించారు. పోలీసులు తోపులాటకు దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
గుంటూరులో లాఠీచార్జ్
గుంటూరు బ్రాడీపేటలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలను పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుడిచేతికి గాయమైంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిరసన ప్రదర్శన చేశారు. మల్లమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పల్నాడు రోడ్డులోని పాత ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉన్న కాంప్లెక్స్కు ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు.
రోత రాతలపై కన్నెర్ర
ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు మహిళలను అడుగడుగునా అడ్డుకున్నారు. నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ సెంటర్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, మహిళలను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని మార్గాల్లో బారికేడ్లను, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రోప్ పార్టీలతో అడ్డుకున్నారు.
పోలీసులను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ముఖ్యనేతలతోపాటు మహిళలు, పార్టీ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసిన మహిళలు ‘రాధాకృష్ణా ఖబడ్దార్’ అంటూ హెచ్చరికలు జారీచేశారు.
మురికి వ్యాఖ్యలపై నిరసనలు
ఉభయ గోదావరి జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, మహిళలు నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాలచెరువు సెంటర్లో గల ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు బైఠాయించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో నిరసన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు వేసిన టెంట్ను పోలీసులు తొలగించారు.
హైస్కూల్ సెంటర్ నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న నాయకులు, కార్యకర్తలు, మహిళలను అడ్డుకుని వెనక్కు నెట్టేశారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు హైసూ్కల్ సెంటర్లోనే నిరసనకు దిగి ఆంధ్రజ్యోతి, రాధాకృçష్ణకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఉత్తరాంధ్రలోనూ పెల్లుబికిన నిరసనలు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విశాఖలోని అక్కయ్యపాలెం వద్ద గల ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అక్కడే బైఠాయించి రాధాకృష్ణ రాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాయలసీమలో నిరసనల వెల్లువ
అనంతపురంలోని ఏబీఎన్ ప్రాంతీయ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఆందోళన చేశారు. అక్కడ పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అడ్డుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టి»ొమ్మను దహనం చేశారు. కడపలో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైఎస్సార్సీపీ నేతలు, మహిళలు ప్రయత్నించారు. పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు.
ధర్నా చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. రాధాకృష్ణ డౌన్ డౌన్, బూతు చానల్ ఏబీఎన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పార్టీ నేతలను బలవంతంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తం 57 మందిని అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులు చేతబూని ఆర్ఎస్ రోడ్డు నుంచి రాజ్విహార్ సెంటర్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం రాధాకృష్ణ ఫొటోలను మహిళలు చెప్పులతో కొట్టి అక్కడే కాల్చారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదేం పని.. బాలస్వామీ!
మహిళా కానిస్టేబుల్పై చేతులు వేసిన డీఎస్పీ
కడప (కార్పొరేషన్): కడపలో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన మహిళలను అరెస్ట్ చేసే క్రమంలో డీఎస్పీ బాలస్వామిరెడ్డి వారిని చేతులు పట్టి లాగుతూ వీపు, నడుముపై తోస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ, మాజీ కో–ఆప్షన్ సభ్యురాలు బి.మరియను మహిళా కానిస్టేబుళ్లు జీపులో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంటే డీఎస్పీ బాలస్వామిరెడ్డి మహిళా కానిస్టేబుల్ చేయిపట్టి లాగుతూ వీపు, నడుముపై చేతులు వేసి తోశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మహిళలపైనా చేతులు వేశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చేతులు వేసి తోయడంతో సదరు మహిళా కానిస్టేబుల్ చిన్నబుచ్చుకుంది.


