విశాఖ: ఏపీ ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ వస్తుందనే మోసపూరిత హామీలతో ఓట్లు దండుకున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కూటమి ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ నిర్వహించిందని ధ్వజమెత్తారు. హెరిటేజ్ పాలు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
‘లక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు. హెరిటేజ్లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. నిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి డీఎస్సీ ఉద్యోగాలకు వేలం పాట పెట్టారు. లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ మోసంలో లోకేష్ను ఏ-1గా అరెస్ట్ చేయాలి. సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వైఎస్సార్సీపీ ధర్నాల్లో వేలాది మంది డీఎస్సీ బాధితులు హాజరయ్యారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై పవన్ కళ్యాణ్కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే..
డీఎస్సీ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం . ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే జరిగిందన్నారు. ఒక్కొక్క పోస్ట్ను రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా వైఎస్ జగన్ నియమించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ జిల్లాకు లక్ష ఉద్యోగాలు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడం లేదు’ అని స్పష్టం చేశారు.


