విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టును పార్టీకి చెందిన బీసీ నేతలు ఖండించారు. లేని లిక్కర్ కేసును ఉన్నట్లు చూపించి కారుమూరిని అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధ్వజమెత్తారు.
‘మాజీ మంత్రి కారుమూరి అరెస్టు అక్రమం. లేని లిక్కర్ కేసును సృష్టించి అరెస్టు చేశారు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కారుమూరి అరెస్టు కక్ష సాధింపు చర్యల్లో భాగమే’ అని రమేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ. .లేని కేసును సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారన్నారు. కారుమూరిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశారన్నారు. బీసీ నేతలపై వెన్నుపోటు పార్టీ అనైతికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అక్రమ మద్యాన్ని తమ హయాంలో పూర్తిగా నియంత్రించామన్నారు. మద్యం షాపులను సైతం తగ్గించామని, కారుమూరిని కావాలనే కేసులో ఇరికించారన్నారు. వెన్నుపోటు పార్టీ ఇకనైనా అరాచకాలు ఆపాలన్నారు. లేకపోతే చంద్రబాబుకు బీసీలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అసలైన మద్యం స్కాం చంద్రబాబు హయాంలోనే జరిగిందని మరో మాజీ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. 2014-19లో మద్యం విక్రయాల్లో అక్రమాలు జరిగాయన్నారు. బార్లకు మేలు చేసేందుకు ప్రివిలేజ్ ఫీజును కూడా రద్దు చేశారని, చంద్రబాబు హయాంలోని మద్యం కేసులను కప్పిపుచ్చుకునేందుకే ఈ అక్రమ కేసులని మండిపడ్డారు. కారుమూరి అరెస్టును తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్టు


