
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో ఈతకు వెళ్ళి ఐదుగురు చిన్నారులు మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. వేసవి సెలవులు కావటంతో ఈత కొట్టాలని భావించి ఐదుగురు పిల్లలు చెరువులోకి దిగారు. ఈ క్రమంలో చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) నీటిలో మునిగిపోయి మృతిచెందారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు.
పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
