దొంగ ఎత్తులు.. నక్కజిత్తులు! | Yellowmedia Over Action on sand mining in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దొంగ ఎత్తులు.. నక్కజిత్తులు!

Jun 1 2026 5:20 AM | Updated on Jun 1 2026 5:20 AM

Yellowmedia Over Action on sand mining in Andhra Pradesh

కృష్ణా జిల్లా పెద్ద పులిపాక శివారున కృష్ణానది మధ్యలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేసి భారీ వాహనాల్లో తరలిస్తున్న ఇసుకాసురులు(ఫైల్‌)

రాష్ట్రంలో ఇసుక దోపిడీపై ఈనాడు పచ్చ పైత్యం 

యథేచ్ఛగా ఇసుకను దోచేస్తున్నది చంద్రబాబు అండ్‌ గ్యాంగే

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగిందని దుష్ప్రచారం  

అప్పట్లో పారదర్శకంగా టెండర్ల ద్వారా ఇసుక కాంట్రాక్టులు 

ఫలితంగా ఇసుకపై ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్ల ఆదాయం 

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి రివర్స్‌

ఇప్పుడు ప్రభుత్వానికి చిల్లి గవ్వ ఆదాయం లేదు.. అప్పుడు, ఇప్పుడు చంద్రబాబు ఇంటి వెనకే అక్రమంగా ఇసుక తవ్వకాలు.. 

గతంలో ఆ తవ్వకాలపై రూ.100 కోట్ల జరిమానా విధించిన ఎన్‌జీటీ

ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసిన సిట్‌ 

ఇప్పుడెక్కడా రాష్ట్రంలో ఉచితంగా ఇసుక దొరకని వైనం 

నదులు, వాగులు, వంకలు, పొలాల్లోనూ యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు  

ఇన్ని వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పచ్చ పత్రిక తప్పుడు కథనం

ఏది నిజం ?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరు దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. నక్కజిత్తులతో ప్రజలను మాయ చేయాలని చూస్తోంది. ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటిలాగే తప్పుడు ప్రచారానికి దిగింది. తానే ఇసుక దందా నడుపుతూ గతంలో అక్రమాలు జరిగాయని విష ప్రచారం చేస్తోంది. ఇందుకు ‘ఈనాడు’ తందానా అంటోంది. ఈ క్రమంలో జగన్‌ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానికి భారీగా జరిమానాలు విధిస్తున్నారంటూ అడ్డగోలు కథనం అచ్చేసింది. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం సాగాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటి వెనుక కూత వేటు దూరంలోనే ఇసుక మాఫియా కృష్ణా నదిని కొల్లగొట్టడంపై 2019 ఏప్రిల్‌ 4వ తేదీన ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. 

అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయం 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో పారదర్శక ఇసుక విధానం అమలైంది. 2019 వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి, ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా, ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి. 

బాబు రాగానే అక్రమాలు మొదలు
2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే.. జగన్‌ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్‌ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై టీడీపీ నేతల కన్ను పడింది. నేతలు ఎక్కడికక్కడ ఆ ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. సగానికి పైగా ఇసుక అమ్మేసుకున్నాక.. యార్డుల్లో పెద్దగా నిల్వలు లేవంటూ మిగిలిన కొద్దిపాటి ఇసుకను ప్రజలకు విక్రయించారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తవ్వకం చార్జీలు, లోడింగ్‌ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్‌లు, డీ సిల్టింగ్‌ పాయింట్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్‌ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.

ప్రస్తుతం యథేచ్ఛగా
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉచితం ముసుగులో ఇసుక అక్రమాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి, అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.

⇒ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా.. అనుమతి లేని రీచ్‌లలో ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సివుండగా, ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుకను రూ.30-60 వేల వరకు అమ్ముతున్నారు.

⇒ ఎన్టీఆర్‌ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. చినబాబుకు ఆ మేరకు కమీషన్లు ఠంచనుగా చేరిపోతున్నాయి.

⇒ చినబాబుకు కప్పం చెల్లిస్తూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు.. నదులు, వాగులను కొల్లగొడుతూ వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను దాచి పెట్టేందుకు గతంలో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలకు జరిమా నాలు విధిస్తున్నారని ఎల్లోమీడియా అండతో చంద్రబాబు అండ్‌ కో దుష్ప్రచారం చేస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement