‘వెన్నెముక’పై విషపు రాత

Yellow Media Fake News On YS Jagan Govt - Sakshi

బీసీల సమగ్రాభివృద్ధిని చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్‌ 

నాడు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న చంద్రబాబు 

ఇస్త్రీ పెట్టె, కత్తెర్లు ఇచ్చి ఇదే ఆదరణ అంటూ వంచన 

ప్రశ్నించిన బీసీలపై తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అంటూ బెదిరింపు 

నేడు వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దిన సీఎం వైఎస్‌ జగన్‌ 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా బీసీలకు మేలు 

బీసీలంటే చంద్రబాబుకు ఎంత ప్రేమంటే.. తలా ఇస్త్రీ పెట్టె, కత్తెర ఇచ్చి ఇదే ఆదరణ అంటూ అవమానించేంత. ఓటేసేంత వరకు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి, అమిత ప్రేమ ఒలకబోయటం, వారి ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత చీదరింపులు, అవమానాల పాలు చేయడం. బాబు వంచనకు తట్టుకోలేకపోయిన బీసీలు ఇదేమి ఆదరణ అని ప్రశ్నిస్తే.. ‘మీ తోకలు కత్తిరిస్తా.. పిచ్చాటలు ఆడితే తోలుతీస్తా..’ అంటూ కళ్లెర్రజేసి, వేలు చూపించి బెదిరించడం. ఆ చంద్రబాబుకు ప్రజలే అధికారాన్ని కత్తిరించి దీటైన బదులిచ్చారు.

నేడు.. వెనుకబడిన కులాలను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలబెడుతూ వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తాత్కాలిక ఉపశమనాలతో సరిపెట్టకుండా బీసీలను ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దేలా సరికొత్త వివ్లవానికి నాంది పలికారు సీఎం వైఎస్‌ జగన్‌. అందుకే బీసీలంతా వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకొని ఈరోజు సీఎం వైఎస్‌ జగన్‌కు అండదండగా నిలుస్తున్నారు. 

టీడీపీ, ఎల్లో బ్యాచ్‌కు మాత్రం ఇది ఓ దురవస్థ. వాస్తవాలను జీర్ణించుకోలేని కడుపు మంట. వైఎస్‌ జగన్‌కు బీసీల మద్దతు కొనసాగితే చంద్రబాబుకు, టీడీపీకి పుట్టగతులుండవన్న ఏడుపు. అందుకే టీడీపీ, దాని ఎల్లో మీడియా విషం కక్కుతోంది. పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా ‘పైసా పనికాలేదు.. పదవీ కాలం ముగిసిపోయింది’ అంటూ ఈనాడు అబద్ధాలను వండి వార్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న బీసీల సమగ్రాభివృద్ధిని గమనిస్తే పచ్చ పత్రిక వంకర రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అవగతమవుతుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో బీసీల పురోగతిపై వాస్తవాలు ఇవి.. 
-సాక్షి, అమరావతి

బీసీల కోసం నిలబడటం అంటే ఇదీ.. 
దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో, ఏ బీసీ ముఖ్యమంత్రి సైతం చేయని విధంగా బీసీల పక్షాన నిలబడింది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. ఇది ఓ రికార్డు. అధికారంలోకి రాక ముందు బీసీల సమస్యల అధ్యయానికి కమిటీ వేసి వారి సూచనలను మేనిఫెస్టోలో చేర్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీనీ అమలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. బీసీల సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా శాశ్వత కమిషన్‌ వేసి కార్యదక్షతను చాటారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ పార్లమెంట్‌లో ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టించిన ఘనత జగన్‌కే దక్కింది.

38 బీసీ ఉప కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణలో సైతం కులం కాలమ్‌ చేర్చి కుల జనగణన చేపట్టాలని, తద్వారా జనాభా (దమాషా) ప్రాతిపదికన బీసీల వాటా బీసీలకు కేటాయించి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి చరిత్ర సృష్టించారు. బీసీల ప్రయోజనాల పరిరక్షణ, వారి అభ్యున్నతికి పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేస్తున్న కృషి మరువరానిది. తిరుమల ఆలయంలో సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును కల్పించి ఏడుకొండలస్వామిని సేవించుకొనేలా జీవో జారీ చేయడం విశేషం. 

బీసీల సామాజిక సాధికారతకు బాటలు 
రాష్ట్రంలో రాజకీయంగానూ బీసీలకు ప్రముఖ స్థానం కల్పించారు సీఎం జగన్‌.  రాష్ట్ర మంత్రివర్గంలో ఏకంగా 11 మంత్రి పదవులు బీసీలకే ఇచ్చారు. ఇందులో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది. 136 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతికి బాటలు వేశారు. దేవాలయాల ట్రస్టు బోర్డులు, మార్కెట్‌ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, వారికి ఉన్నత స్థానాలు కల్పించారు.

నామినేషన్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ల పద్ధతిలో బీసీలకు కేటా­యించేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి మరీ అమలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, మరో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, మరోవైపు ఆరోగ్య రంగం, అవుట్‌సోర్సింగ్‌ విభాగంలో దాదాపు లక్ష మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2.60 లక్షల మంది వాలంటీర్లలో సగానికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఇలా అనేక రంగాల్లో వారి బీసీల అభ్యున్నతికితో  డ్పడి, తలరాతలు మార్చి, సామాజిక సాధికారతను సాధించి పెట్టారు సీఎం వైఎస్‌ జగన్‌. 

సంక్షేమంలోనూ సగానికి మించి.. 
రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు పదవుల్లోనే కాదు. సంక్షేమంలోను సగానికిపైగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయ నిర్మాతగా వారి మన్ననలు అందుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ నవరత్నాలతో బీసీల్లో నవోదయం తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల ద్వారా బీసీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయమైన లబ్ధి చేకూరింది.

ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రతి యేటా రూ.15 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి అంతకు మించి ఖర్చు చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ఒక్క బీసీలకే డీబీటీ (ప్రత్యక్షంగాను), నాన్‌ డీబీటీ (పరోక్షంగాను) ద్వారా ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు లబ్ధిని చేకూర్చి రికార్డు సృష్టించారు.  

2019 జూన్‌ నుంచి ఈ ఏడాది నవంబర్‌ వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని గమనిస్తే ఏకంగా 51 శాతంపైగా నిధులు బీసీలకు దక్కడం విశేషం. రాష్ట్రంలో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మొత్తం 10,20,17,931 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద రూ.3,19,227.86 కోట్ల ప్రయోజనం కలిగితే వారిలో 5,05,32,725 మంది బీసీ లబ్ధిదారులకు రూ.1,63,344 కోట్లు లబ్ధి కలిగింది.

ప్రత్యక్షంగా (డీబీటీ) 7,46,80,150 లబ్ధిదారులకు రూ.1,77,585.51 కోట్లు లబ్ధి కలిగితే వారిలో బీసీలు 3,72,56,695 మందికి రూ.85,915.06 కోట్లు ప్రయో­జనం కలిగింది. పరోక్షంగా  2,73,­37,781 లబ్ధిదారులకు రూ.1,41,642.35 కో­ట్లు లబ్ధి కలిగితే వారిలో బీసీలు 1,32,76,030 మం­దికి రూ.77,429.10­కోట్ల ప్రయోజనం కలిగింది.

దగా చేసిన బాబుకు ఈనాడు బాకా ఊదుతోంది 
ఇవి ఎల్లో బ్యాచ్‌ జీర్ణించుకోలేని వాస్తవాలు. చంద్రబాబు 14 ఏళ్లే కాదు.. ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, బీసీలకు మేలు చేయడానికి మనసు రాదన్నది సత్యం. ఇందులో పదో వంతు మేలు కూడా చేయలేరన్నది నిజం. అందుకే చంద్రబాబు హయాంలో బీసీలు దగా పడ్డార­న్నది సుస్పష్టం. మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేక ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్‌ కిట్లు, పనిముట్లు ఇచ్చి బీసీలను బురిడీ కొట్టించారు.

బీసీలకు 2014లో చంద్రబాబు 114 హామీలు ఇచ్చి పది శాతం కూడా అమలు చేయకుండా దగా చేశారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను మాఫీ చేస్తానని దగా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒక ప్రహసనంగా మార్చారు. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలకు ఉచిత చదువులను అటకెక్కించారు. ప్రధానంగా బీసీ సబ్‌ప్లాన్‌ తెచ్చి ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తానని నమ్మించిన బాబు కనీసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయకుండా వంచించారు.

అప్పట్లో ఇంటికో ఉద్యోగమని, ఉద్యో­గం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని నమ్మబలికి మోసం చేశారు. బీసీల వెన్నెముక విరిచారు. ఇప్పడు బడుగువర్గాల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీసీలకు చేస్తున్న మేలు చూసి ఈనాడు వెన్నులో వణుకు పుట్టింది. జన్మలో చంద్రబాబు సీఎం కాలేరన్న నిజం నెత్తికెక్కడంతో జగన్‌ ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది.

బీసీలను అడుగడుగునా దగా చేసిన చంద్రబాబును భుజాన వేసుకుంది. మరోమారు బీసీలను మభ్యపెట్టి, సాధికారితను దెబ్బ­కొట్టి, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే వారిగా మార్చాలని అబద్ధపు వార్తలు రాస్తోంది. అయినప్పటికీ, ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ఈనాడు వంకర రాతలను నమ్మేస్థితిలో లేరు. ఇది పచ్చి నిజం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top