ఆదోనిలో ఓటర్ల వివరాలు ‘మై టీడీపీ పాస్పోర్టు’ యాప్లో నమోదు
ప్రతి ఓటరు డేటా అప్లోడ్ చేసిన వెంటనే స్క్రీన్షాట్ తీసి టీడీపీ నేతకు చేరవేత?
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారనే అనుమానాలు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ యాప్లో నమోదు చేస్తున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) వెంట టీడీపీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ) ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని ‘మై టీడీపీ పాస్పోర్టు’ అనే యాప్లో నమోదు చేస్తున్నారు. మంగళవారం ఆదోనిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 243 పరిధిలో బీఎల్వోతో కలిసి టీడీపీకి చెందిన శ్రీనివాసాచారి ఓటర్ల వివరాలను సేకరించారు.
ఆ వివరాలను ఆయన ‘మై టీడీపీ పాస్పోర్టు’లో నమోదు చేశారు. ఎప్పటికప్పుడు తాను నమోదు చేసిన ఓటర్ల డేటాను స్క్రీన్షాట్ తీసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఫారం–7 సమర్పించి వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు ఈ కుట్ర చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి బీఎల్ఏ తమ పరిధిలో కనీసం 50 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను ఫారం–7 సమర్పించడం ద్వారా తొలగించేలా చూడాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే టార్గెట్ పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ బీఎల్ఏల అక్రమ చర్యలను అడ్డుకోవాల్సిన బీఎల్వోలు వారికి పూర్తిగా సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


