రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది విభిన్న వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం కోస్తా ప్రాంతంలో ఎండలు దంచికొట్టగా.. సీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మద్దిపాలెంలో 9.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక్కడ సెగ
మరోవైపు పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.


