
బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదన
తెలంగాణలోని పునరుత్పత్తి జలాలను ఆంధ్రాకు కేటాయించారు
కృష్ణా, కావేరి పరీవాహకాల మధ్యన సారూప్యతలు
కావేరి ట్రిబ్యునల్ సూచించిన మేరకు పంట వాస్తవిక నీటి అవసరాన్ని అంచనా వేయాలి
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరీవాహకంలోని (బేసిన్) తెలంగాణ ప్రాంతంలో పునరుత్పత్తి అయ్యే జలాలను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని cc ఏకరవు పెట్టింది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కంటే ముందే ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాం కాలువ వ్యవస్థను చేపట్టి ఉంటే తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాలు అందేవని పేర్కొంది. ఏపీలో బేసిన్ ఆవలకు కృష్ణా జలాలను భారీగా తరలిస్తున్నారని.. తెలంగాణలో బేసిన్లో కనీసం ఒక్క పంటకు కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొందని పేర్కొంది.
బేసిన్లోని రైతులకు ఒక్క పంటకైనా నీళ్లందించేలా కేటాయింపులు చేయాలని వాదించింది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2లో రెండో రోజు గురువారం తెలంగాణ తరఫున సీనియర్ కౌన్సిల్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు విన్పించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు.
నీటి కొరత.. సరఫరా కంటే డిమాండ్లు ఎక్కువ.. వంటి పలు విషయాల్లో కృష్ణా, కావేరి బేసిన్ల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు. శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా పంట వాస్తవిక నీటి అవసరాన్ని అంచనా వేయాలని కావేరీ ట్రిబ్యునల్ సూచించిందని పేర్కొన్నారు.
సాంబ వంటి దీర్ఘకాలిక రకాలను కాకుండా స్వల్పకాలిక, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండిస్తే నీటిని మిగిల్చి.. మిగతా ఆయకట్టుకు అందించవచ్చని కావేరి ట్రిబ్యునల్ పేర్కొందని వివరించారు. కృష్ణా బేసిన్లో కూడా స్వల్పకాలిక, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగుచేయడం ద్వారా వినియోగాన్ని తగ్గించి.. మిగిలిన నీటిని బేసిన్లోని రైతులకు కనీసం ఒక్క పంటకైనా అందించడానికి కేటాయించాలని వాదించారు.