
భేతాళ కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషియో ఫాంటసీ సినిమాతో పిట్ట కథ
కథ, స్క్రీన్ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా ముఖ్యనేతే
సహకార బాధ్యతలు నిర్వర్తించిన పోలీసులు
ఎల్లో మీడియా ద్వారా కుట్ర సినిమా రిలీజ్
నకిలీ మద్యం కేసును నీరుగార్చే వ్యూహం
మాఫియా సూత్రధారులు, టీడీపీ పెద్దలను కాపాడే కుతంత్రం.. ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మద్యం మాఫియా
ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుట్ర బట్టబయలు
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో టీడీపీ పెద్దలు బెంబేలు, అందుకే డైవర్షన్ కుట్ర.. కట్టుకథలతో ఏ1 జనార్దన్ వీడియో విడుదల
జోగి రమేశ్ పేరు కుట్రపూరితంగా జనార్దన్తో పలికించిన ముఖ్య నేత
సాక్షి, అమరావతి: భారీ దోపిడీయే లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియాతో బరితెగించి అడ్డంగా దొరికిన ముఖ్యనేత సరికొత్త కుట్రకు తెరతీశారు. ఇప్పటికే భేతాళ కథలతో, అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న ఆయన ఈ కుతంత్రాన్ని పతాకస్థాయికి చేర్చి పొలిటికల్ సోషియో ఫాంటసీ కథతో కనికట్టు చేసే ఎత్తుగడ వేశారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల మద్యం దోపిడీ కుట్రలో పాత్రధారి జనార్దన్రావుతో డైవర్షన్ కుట్రకు ముఖ్యనేత పక్కా స్క్రిప్టుతో రంగంలోకి దిగారు. ఈ కుట్ర సినిమా షూటింగ్ కోసం పోలీసులే ఆర్ట్ డైరెక్షన్ బాధ్యత భుజానికెత్తుకుని గుర్తు తెలియని ప్రదేశంలో సెట్ రెడీ చేశారు. ముఖ్యనేత స్టార్ట్ కెమెరా అనగానే.. జనార్దన్రావు చిలుక పలుకుల్లా డైలాగులు చెప్పేశారు! ఆయన దారి తప్పకుండా పక్కనుంచి పోలీసులు ప్రాంప్టింగ్ అందిస్తూ డైలాగులు గుర్తు చేశారు.
నకిలీ మద్యంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చుట్టూ కట్టుకథ అల్లారు. ముఖ్యనేత అనుకున్నట్లుగా కుట్రకథ చిత్రీకరణ పూర్తి కాగానే ప్యాకప్ చెప్పారు. ఆదివారం తన నివాసంలో ఈ కుట్ర కథ గురించి మీడియాకు లీకులు ఇచ్చి టీజర్ విడుదల చేసిన ముఖ్యనేత.. సినిమా విడుదలకు సోమవారం ముహూర్తం పెట్టారు. టీడీపీ వీరవిధేయులతో సిట్ ఏర్పాటు చేసిన వెంటనే తమ పొలిటికల్ సోషియో ఫాంటసీ సినిమా రిలీజ్కు పచ్చ జెండా ఊపారు. కథ, స్క్రీన్ప్లే, మాటలు, డైరెక్షన్.. అంతా ముఖ్యనేత కేంద్రంగా సాగిన ఆ తెర వెనుక కుట్ర ఇలా ఉంది..
ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మాఫియా.. దిక్కుతోచని స్థితిలో ముఖ్యనేత
టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడటంతో మాఫియా సూత్రధారిగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. ఎందుకంటే.. ఈ దందాలో బయటపడిన పాత్రధారులు అందరూ ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులే. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫాం ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గు తేలింది.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం తయారీ ప్లాంటు
జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్ధన్రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫాం ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫాం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫాం ఇస్తున్నప్పుడు జనార్దన్రావు పక్కనే ఉండటం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది.
నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పది రోజుల క్రితం బయటపడిన నకిలీ మద్యం మాఫియా వేళ్లు రాష్ట్రం అంతటా విస్తరించాయి. టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ బాగోతం అంతా ఫొటో, వీడియో ఆధారాలతోసహా బయటపడింది. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారానే నకిలీ సరుకును మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బెల్ట్ దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్నారన్న వాస్తవం వెల్లడి కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది.
పచ్చముఠాల దందా, టీడీపీ పెద్దల నిర్వాకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. దాంతో నకిలీ మద్యం మాఫియా సూత్రధారి, అంతిమ లబి్ధదారుగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. తమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో ఆగమేఘాలపై ఈ వ్యవహారాన్ని దారి మళ్లించాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు.
సీబీఐ అంటే గుబులు... అందుకే ‘పచ్చ’ సిట్తో పన్నాగం!
గతంలో నమోదు చేసిన అక్రమ మద్యం కేసులోగానీ... ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో గానీ సీబీఐ దర్యాప్తు అంటేనే ముఖ్యనేత బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్తో రాజకీయ వేధింపులకు పాల్పడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ద్వారానే వేధింపులకు పాల్పడుతున్న విషయం విదితమే. ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్సీపీ డిమాండ్ను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదు. అయితే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ కుట్రలు వరుసగా బెడిసికొడుతున్నాయి.
వైఎస్సార్సీపీ నేతలు, అప్పటి అధికారులకు వ్యతిరేకంగా సిట్ నమోదు చేసిన అభియోగాలు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. అదే సమయంలో అసలు మద్యం మాఫియాను నిర్వహిస్తోంది టీడీపీ పెద్దలేనన్న విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. 2014–19లో టీడీపీ హయాంలో సిండికేట్ ద్వారా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఆ అవినీతిని గతంలోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా నకిలీ మద్యం దందాకు బరితెగించినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది.
భారీగా పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన కల్తీ మద్యం మాఫియా రాష్ట్రం అంతటా విస్తరించినట్లు నిగ్గు తేలింది. ఆ మాఫియా సూత్రధారి ముఖ్యనేత కాగా... పాత్రధారులు టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్రావు... పంపిణీదారులు టీడీపీ సీనియర్ నేతలన్నది బట్టబయలైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీతోపాటు ప్రజలూ డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం తోసిపుచ్చడం గమనార్హం. తమకు అలవాటైన రీతిలో టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో మరో సిట్ను నియమించింది.
తద్వారా నకిలీ మద్యం దందా సూత్రధారులు, పాత్రధారులైన టీడీపీ నేతలను ఈ కేసు నుంచి తప్పించే ఎత్తుగడ వేసింది. వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా ఈ కేసులో ఇరికించే కుట్రకు తెరతీసింది. అందులో భాగంగానే సిట్ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల అయిన కాసేపటికే... ముఖ్యనేత డైరెక్షన్లో ఏ1 జనార్దన్ మాట్లాడిన వీడియోను ఎల్లో మీడి యా ద్వారా విడుదల చేయించారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం మీడియా సమావేశంలో చూచాయగా వెల్లడించిన విషయాలనే జనార్దన్ వీడియోలో వల్లె వేయడం గమనార్హం.
మొదట పోలీసుల అదుపులో.. ఇప్పుడు జైల్లో .. అసలు జనార్దన్ మీడియాతో ఎలా మాట్లాడారు?
ఎల్లో మీడియా ద్వారా విడుదలైన ఏ1 జనార్దన్రావు వీడియో ముఖ్యనేత కుతంత్రాన్ని బట్టబయలు చేసింది. ఆయన ప్రభుత్వానికి అధికారిక అతిథి అన్నది కూడా స్పష్టమైంది. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించకుంటే నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ పెద్దల పేర్లను బయటపెడతానని జనార్దన్రావు బెదిరించినట్లు చర్చ జరుగుతోంది. దాంతో కేసును పక్కదారి పట్టిస్తామని ముఖ్యనేత డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న జనార్దన్రావు ఓ సెలబ్రిటీ తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు ప్రభుత్వ అతిథిగా రాచమర్యాదలు చేశారు. ఇక తాజా వీడియో ఆయన ముఖ్యనేత కుట్రలో పాత్రధారేనని స్పష్టం చేసింది.
అసలు జనార్ధన్రావు ఎల్లో మీడియాకు ఎలా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగలిగారన్నదే అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే.. జనార్దన్రావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ రోజు గుర్తు తెలియని ప్రదేశంలో విచారించి శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించంతో నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. అంటే శుక్రవారం నుంచే ఆయన పోలీసులు, అనంతరం జైలు అధికారుల అదుపులో ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోను ఎల్లో మీడియా సోమవారం విడుదల చేసింది. మరి ఆయన ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడినట్లు...? పోలీసులు, జైలు అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడకూడదు. అయినా సరే జనార్ధన్రావు ఎల్లో మీడియాతో మాట్లాడారంటే.. అది ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం.
పచ్చ పలుకులే పలికిన చిలుక... జనార్దన్రావు
ఇక ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే అసలు కుట్ర మరింత స్పష్టంగా వెల్లడవుతోంది. పక్కన పోలీసులు, టీడీపీ నేతలు పక్కనుంచి చెబుతున్న విషయాలనే జనార్ధన్ రావు వల్లె వేస్తున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది. తమ కుట్రకు అనుకూలంగా అవాస్తవాలను ఆయనతో చెప్పించారన్నది వెల్లడవుతోంది.
ఫాంటసీ కథకు క్లాప్ కొట్టిన ముఖ్యనేత..
ఏ1 జనార్దన్రావుతోనే కట్టుకథల వీడియో
సోషియో ఫాంటసీ సినిమాలు, యూట్యూబ్ వీడియోలను తలదన్నే రీతిలో ముఖ్యనేత కట్టుకథలతో కుతంత్రానికి తెర తీశారు. పిల్లలను ఊహా ప్రపంచంలో విహరింపచేసి మైమరపింపచేసే జానపద కథల మాదిరిగా పొలిటికల్ ఫాంటసీ కథకు క్లాప్ కొట్టారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) అద్దేపల్లి జనార్ధన్రావు ప్రధాన పాత్రధారిగా ఫాంటసీ కథలను వినిపించారు. ముఖ్యనేత స్క్రిప్టును ఆయనతో చెప్పించారు. ఆ ఫాంటసీ వీడియో షూటింగ్ బాధ్యతను ఎల్లో మీడియాకు అప్పగించారు. జనార్దన్రావుతో చెప్పించిన కట్టుకథ ముఖ్యనేత కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. ఎంతగా అంటే.. ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి పాత్రేమీ లేదన్నట్లుగా చిత్రీకరించారు.
ఇక మరో పాత్రధారి సురేంద్రనాయుడు ఊసే లేదు. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేతల ప్రస్తావనే లేకుండా జాగ్రత్తపడ్డారు. నకిలీ మద్యం కేసును 360 డిగ్రీల కోణంలో అడ్డంగా దారి మళ్లిస్తూ... వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ పేరును జనార్దన్రావు నోటితో చెప్పించడం ముఖ్యనేత భేతాళ కుట్రలకు పరాకాష్ట. జోగి రమేశ్ చెబితేనే తాను నకిలీ మద్యం రాకెట్ నిర్వహించానని జనార్ధన్రావు నమ్మబలకడం టీడీపీ మార్కు బరితెగింపు దు్రష్పచారమే. గత ప్రభుత్వ హయాంలోనే తాను కల్తీ మద్యం రాకెట్ నిర్వహించానని... టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే నిలిపివేశానని... మళ్లీ కొన్ని నెలల క్రితం జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టానంటూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడే స్థాయిలో నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. ములకలచెరువులో నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
జనార్దన్రావు వీడియో కుట్రపూరితం.. ఎందుకంటే..?
⇒ నిందితులు ఎవరైనా పోలీసుల విచారణలో చేతులు కట్టుకుని నిలబడి వినయంగా మాట్లాడతారు. ఎల్లో మీడియా విడుదల చేసిన వీడియోలో జనార్దన్రావు ఓ కురీ్చలో తాపీగా కూర్చుని మాట్లాడటం గమనార్హం.
⇒ ఇక ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉంది కదా.. అది చెప్పాలంటూ పక్క నుంచి ఎవరో ప్రోత్సహిస్తుండగా జనార్దన్రావు ఆ స్క్రిప్ట్ వల్లె వేశారు. తన పాత్ర, ప్రమేయం ఏదీ లేదని.. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే అంతా చేశానంటూ చెప్పుకొచ్చారు. అంటే జోగి రమేష్ పేరు చెప్పాలన్న పోలీసుల ఆదేశాలనే జనార్దనరావు పాటించారన్నది స్పష్టమైంది.
⇒ గతంలో తాను కల్తీ మద్యం వ్యాపారం చేశానని జనార్దన్రావు చెప్పగానే... గతంలో అంటే ఎప్పుడు? అంటూ పక్కనే ఉన్న ఓ పోలీసు అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రశ్నించారు. దాంతో గత ప్రభుత్వ హయాంలో అని ఆయన చెప్పారు. అంటే గత ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్టుగా జనార్దనరావుతో బలవంతంగా చెప్పించారన్నది తేటతెల్లమవుతోంది.
⇒ అంతటితో ఈ కుట్రలు ఆగలేదు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకే నకిలీ మద్యం వ్యాపారం మళ్లీ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ చెప్పారని జనార్దన్రావుతో పలికించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు తేవాలనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దీన్ని నిర్వహించాలంటూ తనకు నిర్దేశించారన్నారు. జోగి రమేషే తనను ఆఫ్రికా పంపించారని.. నిధులు సమకూర్చారని.. పోలీసులే జనార్దన్రావుతో దగ్గరుండి మరీ చెప్పించినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోంది. అంటే ఎంత పక్కాగా జనార్దన్రావుతో అవాస్తవాలను చెప్పించారన్నది వెల్లడవుతోంది.