
సాక్షి, అనంతపురం: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికల వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ షేక్(40)కు జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది.
జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మెంబర్గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్ఐఏ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే..
నూర్ వ్యవహారంపై డీఎస్పీ నరసింగప్పకు మీడియాకు కొన్ని విషయాలు తెలియజేశారు. ‘‘నూర్ను లోకల్ పోలీసులే మొదట అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన గ్రూపుల్లో అతను సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాం. కొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాం’’ అని అన్నారాయన.
ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట ఏరియాలో ఉంటున్న నూర్(40) నివాసంలో ఎన్ఐఏ సోదాలతో అంతా ఉలిక్కిపడ్డారు. ఓ హోటల్లో అతను వంట మనిషిగా పని చేస్తున్నట్లు సమాచారం. నూర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.
జైషే మహ్మద్ గురించి..
జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) .. 2000లో మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద సంస్థ. భారత్పై ఉగ్రదాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్లో అతనిపై వారెంట్లు ఉన్నాయ్.
