అధికారులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి
గుంటూరు జిల్లా: నగరం నడిబొడ్డున ఉన్న పరివర్తన భవన్ (ఎస్సీ వెల్ఫేర్ కాలేజీ బాలికల హాస్టల్)లో ఓ విద్యార్థిని బ్యాగ్లో ప్రెగ్నెన్సీ కిట్, మంగళసూత్రం, మెట్టెలు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంక్షేమ హాస్టల్స్లో ఉండే విద్యార్థినుల బ్యాగులు చెక్ చేసే క్రమంలో వారం రోజుల కిందట పరివర్తన భవన్లోని ఓ విద్యార్థిని బ్యాగులో ఇవి బయటపడ్డాయి. వెంటనే సిబ్బంది వార్డెన్కి చెప్పగా, వార్డెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. బయటకు పొక్కడంతో బుధవారం రాత్రి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ లావణ్యవేణి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో అపరిశుభ్ర వాతావరణం చూసి నివ్వెరపోయారు. 2గంటలకుపైగా ప్రతి గదిని తనిఖీ చేశారు.
ముగ్గురు వార్డెన్లు ఉన్నప్పటికీ హాస్టల్ను ఈ విధంగా గాలికి వదిలేస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మళ్లీ వస్తానని హెచ్చరించి, అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం. విద్యారి్థని బ్యాగ్లో దొరికిన ప్రెగ్నెన్సీ కిట్ వ్యవహారంపై ఏఎస్డబ్ల్యూఓ శైలజను వివరణ కోరగా అటువంటి ఘటనలు గాని, ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏఎస్డబ్ల్యూఓ(అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్), హాస్టల్ వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆ శాఖ డీడీ(డిప్యూటీ డైరెక్టర్)ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
నెలకిందట ఇదే హాస్టల్కు చెందిన ఓ విద్యార్థినిని ఓ ఆకతాయి హైదరాబాద్కు తీసుకువెళ్లాడు. 3 రోజులపాటు పోలీసులు శ్రమించి ఆ విద్యార్థినిని హాస్టల్ అధికారులకు అప్పగించారు. ఈ విషయంలో విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు వచ్చి అధికారులపై మండిపడ్డారు. గతేడాది డిసెంబర్లో ఇదే పరివర్తన భవన్లో ఓ విద్యార్థిని ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి వార్డెన్ను సస్పెండ్ చేశారు. హాస్టల్ నిర్వహణపై పాలకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పేందుకు ఈ వరుస ఘటనలే నిదర్శనం.


