సదస్సులో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మహిళా నేతలు
ఆయన పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే
వైఎస్సార్సీపీ హయాంలోనే 50 శాతం రిజర్వేషన్లు అమలు
చట్టం కూడా చేసి ఇస్తే దిక్కులేదు.. అది ఏమైందో తెలియదు
వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపణ
సాక్షి,అమరావతి: ‘చంద్రబాబే ఓ గోబెల్స్ బాస్. ఇతరుల్ని ఎస్కో బార్ అంటాడు. ఆయనే పెద్ద ఎస్కో బార్. ఓ నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు’ అని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ పేరిట తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే.
దగా, మోసం, వెన్నుపోటుకు పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుంది’ అని స్పష్టం చేశారు. ‘ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసి.. మహిళలకు పెద్దపీట వేశానని, 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నారు. చీకటి సామ్రాజ్యాధినేత ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నారు. లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు. అలాంటి వ్యక్తిని రాజకీయంగా నాశనం చేయగలిగే శక్తి వైఎస్ జగన్కే ఉంది. చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ జగనే’ అని స్పష్టం చేశారు.
చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం మహిళలకే ఉంది
‘రెండేళ్లపాటు సాగిన వ్యవస్థీకృత అరాచక పాలనను ఎత్తిచూపుతూ, రెండేళ్లకు ముందు సాగిన దేశంలోనే ఆదర్శమైన పాలనను గుర్తుచేసుకుంటూ.. ప్రజలకు గుర్తుచేస్తూ పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది, దోపిడీకి గురైంది మహిళలే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం వారికే ఉంది. ఏ పాలనకైనా మహిళలకు పెద్దపీట వేయడమే గీటురాయి. జగన్ ఐదేళ్ల పాలన అలాగే సాగింది. చెప్పినవన్నీ చేసేశానని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం దోపిడీ, దగా, మోసానికి పరాకాష్ట. సౌత్, నార్త్లో జనాభా తేడాలకూ, పిల్లల్ని కనడానికి సంబంధం ఏంటి? ఉచిత విద్య, వైద్యం పీకేసి, ఇప్పుడు పిల్లల్ని కంటే వారికి అవన్నీ ఎవరు అందిస్తారు? నెలకు రూ.15 వేలు ఏమైందో తెలియదు, ఆడబిడ్డ నిధి ఏమైందో కూడా తెలియదు.
వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు మహిళలు రూ.1.70 లక్షల కోట్లకు పైగా డ్వాక్రా రుణాలు తీసుకున్నారు. ఇది దేశంలోనే రికార్డు. గతేడాది అది రూ.40 వేల కోట్లకు, ఈ ఏడాది రూ.30 వేల కోట్లకు తగ్గిపోయింది. ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను మహిళలకు గుర్తుచేయాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు వాస్తవాలను గణాంకాలతో సహా వివరించి వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి.
తద్వారా హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చైతన్యం తీసుకురావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు. ఎంపీ తనూజరాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు సత్యవతి, అనూరాధ, పార్టీ అధికార ప్రతినిధులు నందమూరి లక్ష్మీపార్వతి, ఆరె శ్యామల, మాజీ మంత్రి విడదల రజని, మహిళా నాయకులు సుభద్ర, ఉప్పాల హారిక, రాయన భాగ్యలక్షి్మ, కాకాణి పూజిత, నూరి ఫాతిమా ప్రసంగించారు.


