గాజువాకలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం | Road Accident in Gajuwaka | Sakshi
Sakshi News home page

గాజువాకలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Jun 1 2026 6:13 AM | Updated on Jun 1 2026 7:23 PM

Road Accident in Gajuwaka

మరో 9 మందికి తీవ్ర గాయాలు 

నిలిపిన లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

గాజువాక: విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం తెల్ల­వారు­జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం... తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో బొగ్గు లోడుతో గంగవరం పోర్టుకు వెళ్తున్న టిప్పరు లారీ గాజువాక శ్రీనగర్‌ జంక్షన్‌ దాటిన తర్వాత టైరు పేలిపోవడంతో జాతీయ రహదారిపై కుడివైపున ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఆ లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సాలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు కో డ్రైవర్‌ రాయిపల్లి రాంబాబు(50), రాజమండ్రి సీతంపేటకు చెందిన ఆర్‌.రాధామాధవి(35), విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జె.గుమడాం గ్రామానికి చెందిన లెంక ఈశ్వరమ్మ(55) ఘటనాస్థలంలోనే మృతిచెందారు. గాజువాక పోలీసులు వచ్చి బస్సు సీట్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌ ఎస్‌.జమ్మయ్య, ప్రయాణికులు ఎస్‌ఎస్‌ నాగేశ్వరరావు(41), ఎం.శ్రీనివాస్‌(45), కె.రాజు(61), కె.లలిత(55), ప్రశాంతి(31), కె.రామకృష్ణ(70), ఆర్‌.తన్విత(5), ఎం.నివేదిత(7)ను 108 అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.    

కొద్దిసేపు ఆగుదామని ప్రయాణికులు కోరినా... 
బస్సు డ్రైవర్‌ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. బస్సు అతివేగంగా వెళుతుండటంతో సీట్లలో కూర్చోలేకపోతున్నామని, లగేజీ బాక్స్‌లో పెట్టిన వస్తువులు కిందపడిపోతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని డ్రైవర్‌కు సూచిం­చామని తెలిపారు. అయినా పట్టించుకోకుండా వేగంగా వెళుతుండటంతో టీ తాగేందుకు బస్సును ఆపాలని కోరామని చెప్పారు. దీంతో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం జంక్షన్‌లో బస్సును ఆపాడని వివరించారు.

డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉన్నట్టు గుర్తించి కొద్ది­సేపు విరామం తీసుకొని బయలుదేరుదామని చెప్పినా వినిపించుకోలేదని, నిద్ర మత్తులోనే బస్సును వేగంగా నడుపుతూ లారీని ఢీకొట్టాడని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు లారీ డ్రైవర్‌ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. టైర్‌ పేలిపోయిన లారీని రహదారికి ఎడమవైపున కాకుండా కుడివైపున నిలిపివేశాడని, వెనుక కనీసం ఇండికేటర్‌ లైట్లు, రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో బస్సు డ్రైవర్‌ గుర్తించలేక వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అంచనాకు వచ్చారు.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: విశాఖ నగరంలోని గాజువాక శ్రీనగర్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలి­యజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన­వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement