ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ప్రత్యేక పూజలు చేసేందుకు ర్యాలీగా వస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు
తిరుమల లడ్డూపై విషప్రచారంపై వెల్లువెత్తిన నిరసన
రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలతో ఆలయాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల ప్రత్యేక పూజలు
టీడీపీ కూటమి నేతల బాధ్యతారాహిత్యానికి వ్యతిరేకంగా పాప ప్రక్షాళన పూజలు
శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించాలని కోరుతూ అద్దంకిలో ప్రధాని మోదీకి లేఖ
సాక్షి నెట్వర్క్: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, లోకేశ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల కల్తీ ఆరోపణలపై ప్రాయశి్చత్త పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గాల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు.
లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని, కల్తీ జరగలేదని సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలినా టీడీపీ కూటమి నేతలు బాధ్యతారహిత్యమైన ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చేస్తుండడాన్ని నిరసిస్తూ అభిషేకాలు, పాప ప్రక్షాళన పూజలు చేశారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ 101 టెంకాయలు కొట్టారు.
శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించాలని కోరుతూ అద్దంకిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్లను కడిగి పూజలు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విశాఖ పశ్చిమంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో మెట్లు కడిగారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ఆలయాలను నాయకులు శుద్ధిచేశారు. కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టారు.


