సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నందిగామ నందిగామ సీఐ చావన్ అన్నారు. కీసర టోల్గేట్ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్ అతివేగంగా లారీ నడపటం వల్లే డివైడర్ ఎక్కి ట్యాంకర్ కారుపై పడిందన్నారు. లారీ టాంకర్ ఒక్కసారిగా కారుపై పడటంతో లాయర్ శ్రీనివాస్ మృతి చెందారు. లారీ ఫిట్నెస్ను అధికారులు పరిశీలిస్తున్నారు. టోల్గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా? లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
కాగా, అతి వేగంగా వస్తోన్న ఫ్లైయాష్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై పడిన ఘటనలో హైకోర్టు సీనియర్ న్యాయవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వద్ద జరిగింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బొద్దులూరి శ్రీనివాసరావు (55) ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాది. ఈయన శనివారం కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. కీసర టోల్ప్లాజా వద్దకు కారు రాగానే..వెనుక నుంచి ఫ్లైయాష్ లోడుతో వస్తోన్న ట్యాంకర్ అతి వేగంగా వచ్చి ప్లాజా దిమ్మెను ఢీకొంది. అనంతరం అదుపు తప్పి శ్రీనివాసరావు కారుపై పడిపోయింది.
దీంతో కారు నుజ్జునుజ్జయింది. ట్యాంకర్ కారుపై పడిన 3 నిమిషాల పాటు అందులో ఉన్న శ్రీనివాసరావు హారన్ మోగించినట్లు స్థానికులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. భారీ ప్రొక్లెయిన్లు, గొలుసుల సాయంతో ట్యాంకర్ను పక్కకు తీశారు. ఆ తర్వాత ట్యాంకర్ కింద ఉన్న కారును మరో పొక్లెయిన్తో బయటకు తీయగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, ట్యాంకర్ను అతివేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే దానిపై విచారణ చేస్తున్నామని సీపీ చెప్పారు.


