సాక్షి,కృష్ణా: ఉయ్యూరులో డయేరియా (అతిసారం) ప్రబలిందనే విషయాన్ని స్వయంగా అంగీకరించిన మంత్రి నారాయణ, దాని వ్యాప్తికి గల కారణాలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆర్వో ప్లాంట్ల (నీటిని శుద్ధి చేసే యంత్రాలు) నుంచి కూడా నీరు తాగుతున్నారని, వాటి వల్ల కూడా అతిసారం రావచ్చు కదా అంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి పైపులైన్లను భారీగా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందంటూ మున్సిపల్ శాఖ వైఫల్యాలను పరోక్షంగా ఒప్పుకున్నారు. డయేరియా తీవ్రంగా ఉన్న అసలు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించకుండా, బాధితుల ఇబ్బందులను తెలుసుకోకుండా మంత్రి నారాయణ మొహం చాటేశారని స్థానికులు మండిపడుతున్నారు.
ఉయ్యూరులో డయేరియా కారణంగా సంభవించిన మరణాన్ని మంత్రి నారాయణ సహజ మరణంగా ధృవీకరించడం తీవ్ర వివాదాస్పదమైంది. బాధితుడు నూరుద్దీన్ డయేరియాతో కాకుండా కేవలం గుండెపోటుతోనే చనిపోయాడంటూ మంత్రి సమర్థించుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మొత్తంగా, బాధితులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి, వాస్తవాలను కప్పిపుచ్చుతూ పర్యటనను ముగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి


