
అత్తవారే కారణమంటున్న మృతురాలి బంధువులు
భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శ్రీకాకుళం: మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబోమ్మ భవానీ(21) అనే వివాహిత మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలఖండ్యాం గ్రామానికి చెందిన భవానీకి సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్తో తొమ్మిది నెలల కిందట వివాహం జరిగింది. దినేష్ సచివాలయ లైన్మేన్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
పాలఖండ్యాంలోని పుట్టింటికి వెళ్లిన భవానీ ఈ నెల 14న సంతవురిటి వచ్చింది. అదే రోజు రాత్రి మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో భవానీ సోదరుడు నాగరాజుకు దినేష్ ఫోన్ చేసి భవానీ మృతిచెందినట్లు సమాచారం అందించాడు. సోదరుడు వెళ్లి చూసేసరికి భవానీ విగతజీవిగా కనిపించింది.
భవానీ మృతికి అల్లుడు దినేష్ , అత్తింటి వారే కారణమని బంధువులు ఆరోపించారు. భవానీ మెడపై గాయాలు ఉండటంతో దినేష్ హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి ధారబోయిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జె.ఆర్.పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మణరావు, క్లూస్టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త దినేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.