చంద్రబాబుకు ఐటీ నోటీసులు | I-T department serves show cause notice to Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు

Sep 1 2023 8:22 AM | Updated on Sep 1 2023 1:19 PM

IT department serves show cause notice to Chandrababu Naidu - Sakshi

అక్రమంగా ముడుపులు అందుకున్న వ్యవహారంలో చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు.. 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.

అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. 

చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు
షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు, చాట్‌లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్‌ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్‌ తనను కలిసి పార్టీకి ఫండ్‌ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్‌మెంట్‌ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement