సెక్షన్‌ 111 కింద కేసులు ఎలా పెడతారు? | High Court Concerned Over Posts On Social Media And Granted Relief To Sajjala Bhargav And Other Activists | Sakshi
Sakshi News home page

సెక్షన్‌ 111 కింద కేసులు ఎలా పెడతారు?

May 9 2025 4:01 AM | Updated on May 9 2025 12:13 PM

High Court concerned over posts on social media

సజ్జల భార్గవ్‌రెడ్డి వ్యవహారంలో ఆక్షేపించిన హైకోర్టు

సెక్షన్‌ 111 కింద కేసు నమోదు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదు

ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే వారిపై సెక్షన్‌ 111 కింద కేసు అనవసరం

సెక్షన్‌ 35(3) ప్రకారం నడుచుకోవాలంటూ పోలీసులకు ఆదేశం

సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై హైకోర్టు ఆందోళన

అసభ్య పదాలను ‘ఆటో బ్లాక్‌’ చేసేలా సోషల్‌ మీడియా సంస్థలకు సూచించండి

రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు

ఈ సెక్షన్‌ వర్తించాలంటే గత పదేళ్లలో ఒక చార్జిషీట్‌ అయినా దాఖలై ఉండాలి

భార్గవ్‌రెడ్డి తదితరులపై ఎలాంటి చార్జిషీట్‌లు దాఖలు కాలేదు

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టుల వ్యవ­హారంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం పూర్వ ఇంచార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డితోపాటు పలు­వురు సోషల్‌ మీడియా యాక్టివిస్టులకు హైకోర్టు ఊరటని­చ్చింది. సోషల్‌ మీడియా పోస్టులను వ్యవ­స్థీకృత నేరం (బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111)గా పరిగణిస్తూ భార్గవ్‌­రెడ్డితోపాటు మరికొందరిపై కేసులు పెట్ట­డాన్ని ఆక్షేపించింది. ఈ సెక్షన్‌ వర్తించాలంటే గత పదేళ్లలో ఒక్కటైనా చార్జిషీట్‌ దాఖలు చేసి ఉండాలని పేర్కొంది. 

ప్రస్తుత కేసులో భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదు చేసే నాటికి ఒక్క చార్జిషీట్‌ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేసింది. అందుకని.. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద కేసు నమోదు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని తేల్చిచెప్పింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే భార్గవ్‌రెడ్డి తదితరులపై సెక్షన్‌ 111 కింద కేసు అనవసరం అని హైకోర్టు పేర్కొంది. 

వీరి విషయంలో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3)కి అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులను ఆదేశించింది. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శ కాలను తప్పక పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో అస భ్య పోస్టులపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్‌రెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి, తియ్యగూర సుమన్, రాహుల్‌రెడ్డి, సత్యకుమార్‌నాయుడు, సుగుణ శేఖర్‌రావు తదితరులపై రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. భార్గవ్‌రెడ్డి మరికొందరిపై సెక్షన్‌ 111తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు పెట్టారు. వీటన్నిటిలో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి తదితరులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ తీర్పునిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

అది ప్రభుత్వ బాధ్యత
‘‘ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అసభ్య, విద్వేష, దుర్భాషలతో పోస్టులు పెట్టడం సాధారణ­మైంది. ‘ట్రోలర్స్‌’ ప్రముఖులు, రాజకీయ నాయకుల గురించి అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అన్నివైపుల నుంచి మెరుపు వేగంతో ప్రతిస్పందన వస్తోంది. అసభ్య సందేశాలు వ్యాపార సంస్థలకు లాభసాటిగా మారాయి. 

రాజ్యాంగం కల్పించిన మేరకు ప్రతి పౌరుడికి హుందాగా జీవించే హక్కు ఉంది. అది ఉల్లంఘనకు గురవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ సూచించారు. ‘‘అసభ్య పదాలను ప్రభుత్వం గుర్తించాలి. సామా జిక మాధ్యమాల్లో వాడకుండా అధికారులకు ఆదేశా లివ్వాలి. ఇలాంటి పదాలను ఉపయోగిస్తే ఆటో బ్లాక్‌ చేసేలా సామాజిక మాధ్యమ సంస్థలకు సూచనలు చేయాలి’ అని న్యాయమూర్తి నిర్దేశించారు.  

అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్‌కు ప్రత్యేక కోర్టుకెళ్లండి
‘సెక్షన్‌ 111 కింద వ్యవస్థీకృత నేరం వర్తించాలంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిందితులకు ఆర్థిక లబ్ధితో సహా మెటీరియల్‌ లబ్ధి కలిగించేవిగా ఉండాలి. కానీ, సెక్షన్‌ 111లో ఎక్కడా మెటీరియల్‌ లబ్ధి అంటే ఏమిటో నిర్వచించలేదు. సాధారణంగా మెటీరియల్‌ లబ్ధి అంటే డబ్బు, ఆస్తి తదితర ప్రత్యక్షంగా చూడగలిగేవి. ప్రస్తుత కేసులో సహ నిందితులు చెప్పినవి నిజమే అనుకున్నా, పిటిషనర్లు ఎలాంటి మెటీరియల్‌ లబ్ధి పొందారు అన్నదానిని ఈ దశలో పరిగణనలోకి తీసుకోలేం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. 

ఎస్సీ, ఎస్టీ కేసులపై భార్గవ్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఇందుకుగాను పిటిషనర్లపై రెండు వారాల పాటు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement