
గుంటూరులో మోస్తరు వాన
తిరుపతిలో ఎడతెరిపిలేని వర్షం
రాష్ట్రంలో అక్కడక్కడా చిరుజల్లులు
సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని రోడ్లు చెరువుల్ని తలపించాయి. పెనుగంచిప్రోలులో 11.2 మి.మీ., కంచికచర్లలో 5.8, ఇబ్రహీంపట్నంలో 3.6, విజయవాడ నార్త్లో 3.6, సెంట్రల్, వెస్ట్లో 3.4, వీరులపాడు, మైలవరం, ఎ.కొండూరు, విజయవాడ రూరల్, విజయవాడ ఈస్ట్లో 3.2 చొప్పున, రెడ్డిగూడెంలో 2.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురవడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరులో మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరు జల్లులు కురిశాయి. జిల్లాలో సగటున 4.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి వర్షం కురవడంతో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, ఉండి నియోజకవర్గాల పరిధిలో మధ్యా హ్న సమయంలో చిరు జల్లులు పడ్డాయి. అనకా పల్లిలో జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. మధ్యా హ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది.
గోదావరికి వరదపోటు
పోలవరం రూరల్/పెనుగొండ: గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఉప నదులు, కొండవాగుల నీరు కూడా చేరి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. స్పిల్ వే 48 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు చేరుతోంది. కాగా.. వశిష్ట గోదావరికి వరద నీరు చేరడంతో పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం వద్ద కేదారీ ఘాట్లో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో పడవలనీ ఒడ్డుకు చేరాయి. లంక భూములకు రాకపోకలు తగ్గాయి. సోమవారం సాయంత్రానికి నెమ్మదిగా నీటి మట్టం పెరిగింది. పుష్కర రేవుకు వరద నీరు చేరింది.