
గుంటూరు ఎస్పీకి మృతుడు
కుర్రా నాగ గణేష్ కుటుంబం ఫిర్యాదు
పట్నంబజారు (గుంటూరు): తన కుమారుడిని నడిరోడ్డుపై అంతమొందిస్తే పోలీసులు డబ్బులు తీసుకుని నిందితులను వదిలేశారని ఇటీవల గుంటూరు పొన్నూరు రోడ్డులో దారుణ హత్యకు గురైన కుర్రా నాగగణేష్ తల్లి శివనాగ అంజలి ఆరోపించారు. ‘పదహారు రోజుల పండుగ కూడా గడవకుండానే నా కుమారుడిని నడిరోడ్డులో బలి తీసుకున్నారు.. వారికి నచ్చని పెళ్లి చేసుకున్నాడని పెళ్లి కుమార్తె అన్న, తండ్రి కలిసి నా బిడ్డను పొట్టన బెట్టుకున్నారు..
ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని పోలీసులు డబ్బులు తీసుకుని వదిలి పెట్టేశారు.. అమ్మా.. చంద్రబాబు భార్య గారూ.. మీకు ఉన్నదీ ఒక్కడే కుమారుడు.. మీ బిడ్డకే ఇలా జరిగితే ఊరుకుంటారా..? పోలీసులు అన్యాయంగా వ్యవహరించారు. రూ.8, 10 లక్షలు ఇస్తే ఎవరినైనా వదిలేస్తారా..?’ అంటూ విలపించారు. ఈ కేసులో అసలు నిందితులను వదిలేసి పోలీసులే దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ బుధవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
వేణును తప్పించేందుకే వీరయ్యను చేర్చారు...!
నాగ గణేష్ హత్య కేసులో నిందితులకు సహకరించారంటూ వైఎస్సార్ సీపీ నేత, దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యను కేసులో నిందితుడిగా చేర్చిన విషయం విదితమే. అయితే గుమ్మా వేణును తప్పించేందుకే వీరయ్యను చేర్చారని తాము భావిస్తున్నట్లు మృతుడి సోదరి, తల్లి, భార్య పేర్కొన్నారు. తాము ఎప్పుడూ వీరయ్యను చూసింది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వీరయ్యను కేసులో ఇరికించారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.