కూర్మన్నపాలెం (విశాఖ) : కల్లబొల్లి కబుర్లుతో ఓ మహిళను నమ్మించి, ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా, ఏకంగా ఆమెను అంతం చేయాలనే క్రూర ఆలోచనతో ఇంటికి నిప్పు పెట్టిన అమానుష ఘటన వడ్లపూడి అప్పికొండ కాలనీలో కలకలం రేపింది. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణించిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి వడ్లపూడిలో నివాసముంటోంది. ఈ క్రమంలో రాంబిల్లి మండలం రాజుపాలేనికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసిన సాయికృష్ణ, ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా జైల్లో ఉన్న సాయికృష్ణ ఇటీవలే విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సాయికృష్ణ బుద్ధి మార్చుకోకుండా, శుక్రవారం రాత్రి పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా అనుభవించాడు. శనివారం రాత్రి కూడా ఆమెతో ఘర్షణకు దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున మళ్లీ వచ్చి ఇంటి బయట ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీతో పాటు ఇంట్లోని సామగ్రి కూడా తగులబడింది. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ స్థానికుల చొరవతో పుష్ప, ఆమె కుమారుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. లేనిపోతే సజీవ దహనం అయ్యేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు విచారణలో తేలింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించగా, ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లేశ్వరరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



