మంత్రి నారా లోకేశ్, ఎంపీ చిన్నిలతో సొంగా సంజయ్ వర్మ
సీసీ ఫుటేజ్ను బయటపెట్టిన భార్య శాంతి శ్రీ
అక్రమ సంబంధాలు పెట్టుకుని వేధిస్తున్నాడు.. ఎంపీ చిన్ని అనుచరుడినంటూ బెదిరింపులు
మద్యం సేవించి చంపబోయాడు
ప్రాణ హాని ఉందంటూ మాచవరం పోలీసులకు ఫిర్యాదు
రామవరప్పాడు (విజయవాడ రూరల్): ‘నేను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అనుచరుడిని. చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్లతో నాకు పరిచయాలు ఉన్నాయి. నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నన్ను ఎవరూ ఏమి చేయలేరు’ అని బెదిరిస్తూ వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఆస్తి కోసం తనను హత్య చేయబోయాడని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ భార్య సొంగా శాంతి శ్రీ ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలోని తన పుట్టింటిలో తన సోదరుడు, గ్రామ మాజీ టీడీపీ అధ్యక్షుడు దేవరపల్లి విజయవర్మతో కలిసి తనపై జరిగిన దాడి, వేధింపులను మీడియాకు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
‘సొంగా సంజయ్ వర్మతో నాకు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. మాకు ఒక కుమార్తె ఉంది. వివాహ సమయంలో మా వాళ్లు రూ.లక్షల్లో నగదు, అపార్టుమెంట్లో ఫ్లాటు కట్నం కింద ఇచ్చారు. అయితే కొన్నేళ్లుగా ఆస్తి కోసం నా భర్త వేధిస్తున్నాడు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని నాపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నాడు. నా భర్త సంజయ్కి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. (రాసలీలల వీడియోను బయట పెట్టారు). నాకు తెలిసి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తెలియని సంబంధాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఈ విషయం అత్త, మామ సొంగా సుజాత, రవీంద్ర వర్మకు తెలిసినా కొడుకునే వెనుకేసుకొస్తున్నారు. ఆడపడుచులు సంధ్య, బిందు బ్యూలా, తోడి కోడలు క్యాథరిన్ కస్తూరి కూడా నన్నే వేధిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున నా భర్త మద్యం తాగి వచ్చి నాపై దాడికి పాల్పడ్డాడు. కత్తిపీటతో దాడికి యత్నించాడు. నేను తప్పించుకుని 112కు కాల్ చేయగా పోలీసులు వచ్చారు. నా భర్త, ఆయన కుటుంబం వల్ల ప్రాణహాని ఉంది. పోలీసులు నాకు రక్షణ కల్పించాలి’ అని శాంతి శ్రీ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆమె మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


