మీకు ఫ్రీ సీటు లేదు! | Chandrababu Govt Conspiracy Against AP Intermediate students | Sakshi
Sakshi News home page

మీకు ఫ్రీ సీటు లేదు!

Jul 25 2025 4:30 AM | Updated on Jul 25 2025 6:56 AM

Chandrababu Govt Conspiracy Against AP Intermediate students

తెలంగాణలో ఇంటర్మిడియట్‌ చదివిన ఏపీ విద్యార్థులకు కూటమి సర్కార్‌ దగా 

నాన్‌ లోకల్‌ కోటాగా పరిగణించి వారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం 

దశాబ్దాలుగా ఏపీలోనే ఉంటూ పన్నులు చెల్లిస్తున్న కుటుంబాలకు చుక్కెదురు

రాజ్యాంగ సవరణ లేని స్థానికత మార్పులతో స్థానికేతరులుగా మార్చేసిన ప్రభుత్వం

ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో సీటు వచ్చినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నోచుకోని వైనం

తెలంగాణ ఈఏపీసెట్‌లో కన్వీనర్‌ కోటా నుంచి ఏపీ విద్యార్థుల తొలగింపు

ఏపీలో సీటు వచ్చినా రూ.వేలల్లో ఫీజులు చెల్లించుకోవాల్సిన దుస్థితి

కూటమి ప్రభుత్వం పేదింటి విద్యార్థులను నిలువునా ముంచేసింది. వారి ఉన్నత చదువుల ఆశలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఏపీలో పుట్టి పెరిగి... దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న కుటుంబాలకు చెందినవారిని విద్యా ప్రోత్సాహ­కాలకు అనర్హులను చేసి తీరని వేదన మిగిల్చింది. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ వేళ తెలంగాణలో కేవలం ఇంటర్‌ చదివి, ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులను కూటమి సర్కారు స్థానికేతరులుగా గుర్తించింది. అయితే, వీరందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయకుండా కష్టాల్లోకి నెడుతోంది.  

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్లయినా హైదరాబాద్‌తో ఏపీ ప్రజలది విడదీయ­లేని బంధం. పేదింటి తల్లిదండ్రులు కష్టనష్టాల కోర్చి తమ బిడ్డలకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్‌లో చేర్పిస్తుంటా­రు. మరికొందరు ఉపాధి కోసం రెండేళ్లు తెలంగాణ ప్రాంతంలో ఉండడంతో వారి పిల్లలు అక్కడే చదువుకునే పరిస్థితి. అలా ఇంటర్‌ చదవ­డమే వారికి శాపంగా మారింది. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేదింటి బిడ్డలు సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది.

పన్నులు కట్టించుకుని.. ‘ఫీజు’ ఎగ్గొట్టి!
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణ ప్రాంత వాసులకు విద్య, ఉపాధి అంశాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక వెసులుబాటు ఇచ్చారు. ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వారీగా మూడు రీజి­యన్ల ద్వారా లోకల్‌ కోటాలో 85 శాతం, నాన్‌లోకల్‌ (అన్‌ రిజర్వుడ్‌) కోటాలో 15 శాతం సీట్లు భర్తీ చేసేవారు. గత ఏడాదితో ఆ పదేళ్ల గడువు ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర రీజియన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలు నిర్వహించింది.

లోకల్‌ 85 శాతం, నాన్‌ లోకల్‌ (అన్‌ రిజర్వుడ్‌)లో 15 శాతం సీట్లు కూడా ఏపీ విద్యార్థు­లకు దక్కేలా జీవోలు తీసుకొచ్చింది. అయితే, రీజి­యన్లలో స్థానికత విషయంలో మెలికపెట్టింది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఏపీలో చదివి­న విద్యార్థులకే ప్రవేశాలలో ప్రాధాన్యం కల్పించింది. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లో చదువుకున్న విద్యా­ర్థులను ఏపీలో నాన్‌లోకల్‌గా మార్చేసింది. వారి కుటుం­బాలు ఏపీలోనే ఉంటూ, పన్నులు కూడా కడుతున్నప్పటికీ విద్యార్థి ఇంటర్మీడియట్‌ చదివిన ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఏపీలో సీటు ఇచ్చేది లేదని మూర్ఖత్వం ప్రదర్శించింది.

దీనిపై విమర్శలు రావడంతో ‘‘విద్యార్థి రెండేళ్లు ఇంటర్మీడియట్‌ రాష్ట్రం వెలుపల చదవినా వారి తల్లిదండ్రులు పదేళ్లు వరుసగా ఏపీలో ఉంటున్నట్టు నివాస ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే’’, నాన్‌ లోకల్‌ కోటా (అన్‌ రిజర్వుడ్‌) 15 శాతం సీట్లలో వెసులుబాటు ఇచ్చింది. కానీ, ఎటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించకుండా నిలువునా మోసం చేసింది.

రెండింటా నష్టపోయి...
ఓవైపు ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభు­త్వం జిత్తులు వేస్తోంది. మరోవైపు కొత్తకొత్త మెలికలతో రాష్ట్ర విద్యార్థులకు మొండిచేయి చూపి­స్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదే స్థానికత అంశాల్లో మార్పులు చేసింది. ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యా సంస్థల్లో సీట్లు కేటా­యించేది లేదని తేల్చి చెప్పింది. ఏపీకి చెందినవారు ఇంటర్‌ తెలంగాణలో చదివి.. అక్కడ ఈఏపీసెట్‌ రాసిన­ప్పటికీ వారిని కన్వీనర్‌ కోటా సీట్ల నుంచి తప్పించింది. దీంతో ఎన్‌ఆర్‌ఐ కోటాలో రూ.లక్షలు పోసి చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

పోనీ, సొంత రాష్ట్రంలో హాయిగా చదువుకుందామని అనుకుంటే కూటమి ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టింది. ఏపీలో ఇంటర్‌ వరకు వరుసగా నాలుగేళ్లు చదివినవారినే లోకల్‌ కోటా కింద పరిగ­ణించింది. 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఒక్క సంవత్సరం బయట చదివినా వారిని స్థానికే­తరు­లు­గా మార్చేసింది. ఈఏపీసెట్‌లో ప్రవేశాలకు విద్యార్థుల తల్లిదండ్రుల పదేళ్ల నివాస కాలాన్ని పరి­గ­ణనలోకి తీసుకుని నాన్‌ లోకల్‌ (అన్‌ రిజ­ర్వుడ్‌) కోటాలో సీట్లు కేటాయించింది. కానీ, ఫీజు­రీయింబర్స్‌మెంట్‌ మాత్రం ఎగ్గొట్టింది. ప్రస్తుతం విద్యా­ర్థులు ఇంజనీరింగ్‌ సీటు అలాట్‌మెంట్‌ లెటర్లు పట్టుకుని కళాశాలలకు వెళ్తుంటే... ముందుగా ఫీజులు చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు.

ముందుచూపులేని స్థానికత! 
సరిగ్గా నిరుడు కూటమి ప్రభుత్వం వచ్చే సమ­యానికి హైదరాబాద్‌పై పదేళ్ల గడువు ముగిసింది. ఈ క్రమంలో విద్య, ఉపాధి అంశాల్లో సమాన అవ­కా­శాలపై స్థానికతను నిర్ధారించడంలో జాప్యం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడక మునుపే అంటే ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న పదేళ్ల గడువులో చివరి ఏడాది ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్‌లో చేరారు. వాళ్లు ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ప్రభుత్వం ఆయా బ్యాచ్‌ విద్యార్థులకు కచ్చితంగా వెసులుబాటు ఇవ్వాల్సింది.

ఇవేమీ పట్టించుకోకుండా కూటమి సర్కారు ముందుకెళ్లడంతో ఏపీ విద్యార్థులు స్థానికత కోల్పోవాల్సి వచ్చింది. పోనీ, గత ఏడాదే ఏపీ విద్యార్థులు తెలంగాణలో చదువుకోవడంపై అవగాహన కల్పించిందా..? అంటే స్థానికతపై తాత్సారం చేసింది. ఈలోగా నిరుడు ఇంటర్‌ కోసం చాలామంది హైదరాబాద్‌ వెళ్లారు. వచ్చే ఏడాది ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో వీరు కూడా స్థానికేతరులుగా మారిపోతున్నారు. అసలు రాజ్యాంగ సవరణ లేకుండా ఏపీ స్థానికతను ఏ విధంగా మార్పు చేస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement