నంద్యాల జిల్లా: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది.
ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.


