కరోనా ఎఫెక్ట్‌: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

AP Ministers Alla Nani And Buggana Rajendra Review Corona Situation In State - Sakshi

వ్యాక్సినేషన్‌ వేగవంతంపై ఆళ్ల నాని, బుగ్గన సమీక్ష

రాజమండ్రిలో కరోనా కలకలంపై స్పందించిన ఆళ్ల నాని

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా  వార్డు, గ్రామ సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ సాగుతోంది. 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’ అని తెలిపారు.

రాజమండ్రిలో కోవిడ్‌ కలకలంపై స్పందించిన ఆళ్ల నాని
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా కరోనా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ‘‘ఇంటర్ చదువుతున్న 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన 163 మంది విద్యార్థులను రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి వైద్య సదుపాయం కల్పించాము. కరోనా నివారణకు తీసుకోవలసిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎమ్‌హోచ్‌ఓ డాక్టర్ గౌరిశ్వరావుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాము. కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా డీఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ గౌరిశ్వరరావును ఆదేశించాము. అంతేకాక తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాం. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్‌కి తరలించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని ఆళ్ల నాని తెలిపారు

‘‘కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50 మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులను 24 గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35 కంటోన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేశాము. తిరుమల జూనియర్ కాలేజీ లో 400 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి’’ అని మంత్రి ఆళ్ల నాని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top