
వచ్చే వారానికి వాయిదా వేయాలన్న అడ్వొకేట్ జనరల్
తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ జగన్, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు
కేసు నమోదు ద్వారా న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని వెల్లడి
సాక్షి, అమరావతి: సింగయ్య మృతికి సంబంధించి తమపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా... అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కేసు డైరీని తెప్పించుకుని చూడాల్సి ఉందన్నారు.
కొన్ని వ్యాజ్యాల్లో తాను, మరికొన్ని వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని తెలిపారు. కాబట్టి వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణను సోమ లేదా మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థనను పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, చిత్తరవు రఘు, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లేవీ చెల్లవని తెలిపారు.
పిటిషనర్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని పేర్నొన్నారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తే అభ్యంతరం లేదని, అప్పటివరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ అరెస్ట్ చేస్తారనే ఆందోళన కారణంగానే ఈ పిటిషన్లు దాఖలు చేశారని.. అలాంటప్పుడు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్ జగన్ తదితరుల తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, మధ్యంతర రక్షణ కోరే హక్కు పిటిషనర్లకు ఉందని వివరించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. తదుపరి విచారణ వరకు కఠిన చర్యలేవీ తీసుకోకుండా మౌఖిక హామీ ఇచ్చేలా ఏజీకి స్పష్టం చేసినా చాలని పేర్కొన్నారు.