ఆయన ఎంత అడిగితే… అంత ఇచ్చేయండయ్యా! | AP Govt Opens Treasury for Chandrababu Lawyer Sidharth Luthra | Sakshi
Sakshi News home page

ఆయన ఎంత అడిగితే… అంత ఇచ్చేయండయ్యా!

May 26 2026 1:07 PM | Updated on May 26 2026 1:13 PM

AP Govt Opens Treasury for Chandrababu Lawyer Sidharth Luthra

సాక్షి, విజయవాడ: ప్రముఖ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు మరోసారి భారీ ఫీజులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం రూ.44 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.33 లక్షలు, రూ.11 లక్షలు చొప్పున విడతల వారీగా విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించినందుకుగానూ ఈ చెల్లింపులు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సిద్ధార్థ లూథ్రా గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరఫున కూడా వాదనలు వినిపించడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

అంతేకాదు… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తరఫున కూడా సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. దేశంలోనే టాప్‌ మోస్ట్‌ లాయర్‌గా ఉ‍న్న లూథ్రా.. తనను తాను పేదవాడిగా చెప్పుకునే దస్తగిరికి ఎంత ఫీజు చెల్లిస్తున్నాడు? ఎలా చెల్లిస్తాడు? అనేది ఆశ్చర్యం కలిగించే అంశమే.  “ఒకవైపు ప్రభుత్వ కేసులు… మరోవైపు చంద్రబాబు కేసులు… ఇంకోవైపు దస్తగిరి కేసు… మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పెద్ద కేసు ఉంటే అక్కడ లూథ్రా ఉంటారన్న మాట” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ లూథ్రాకు రూ.13 కోట్లకుపైగా ఫీజులు చెల్లించినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో నెట్టింట “రాష్ట్రానికి ఫుల్‌టైమ్ లాయరా? లేక ప్రతి హైప్రొఫైల్ కేసుకీ కామన్ అడ్రస్‌నా?” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని సమర్థించుకుంటున్నాయి. దేశంలోని ప్రముఖ సీనియర్ అడ్వొకేట్లలో సిద్ధార్థ లూథ్రా ఒకరని, సుప్రీంకోర్టు స్థాయి కేసుల్లో అనుభవం ఉన్న న్యాయవాదులను నియమించడం సహజమేనని.. కాబట్టి ఆ మాత్రం ఖర్చులు తప్పవని అధికారులు వివరిస్తున్నారు.

అయితే ప్రజలు మాత్రం మరో ప్రశ్న లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ పథకాల నిధుల కొరతపై చర్చ జరుగుతున్న సమయంలో… కోట్ల రూపాయలు న్యాయవాదుల ఫీజులకే వెళ్తుండటం సమంజసమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement