AP: సబ్ రిజిస్ట్రార్లుగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు
వన్టైమ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం నియామకం
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తి చేసేందుకు తీసుకువచ్చిన వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించి పేదల ఇళ్ల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తారని గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది.
సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు వీరికి సహకరిస్తారని తెలిపింది. ఈ పథకం ఒక్క దాని కోసమే వీరు సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని వెల్లడించింది. ఇందుకోసం 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 6లో పాక్షిక మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.