పది రోజుల్లో రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ
అప్పటి వరకు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నామని ‘ఆశా’ ప్రకటన
పది రోజుల్లోగా నిధులు విడుదల చేయకపోతే యథావిధిగా సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బకాయిలు చెల్లించాలని ఏడు రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళవారం తాత్కాలికంగా విరమించాయి. ప్రభుత్వం పది రోజుల్లో రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మెను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం రూ.3,000 కోట్ల బకాయిలు పెట్టడంతో ఈ నెల 1 నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేసి సమ్మె చేస్తున్నాయి. సోమవారం రెండో దఫా ప్రభుత్వం ఆశా ప్రతినిధులతో చర్చలు జరిపింది.
మొత్తం బకాయిల్లో రూ.1,000 కోట్లను పది రోజుల్లో, జూలై అనంతరం మరో రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ చెప్పారు. ప్రతి నెలా రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల మేర బిల్లులు చెల్లించడంతోపాటు నూతన బీమా విధానం రూపకల్పనలో నెట్వర్క్ ఆస్పత్రులను భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. అందువల్ల 10 రోజులు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు.
నమ్మకం లేక...
ప్రభుత్వం పది రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు మాత్రం పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు గద్దెనెక్కాక గతంలో రెండుసార్లు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం సమ్మె చేశాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సమ్మె చేసిన సమయంలో డిసెంబర్కి బకాయిలన్నీ చెల్లించేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ సమ్మెను తాత్కాలికంగానే నిలుపుదల చేస్తున్నామని ఆశా స్పష్టం చేసింది. పది రోజుల్లోగా నిధులు విడుదల చేయకపోతే తిరిగి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది.


