ఆరుగురి పరిస్థితి ఆందోళనకరం
బాలయ్య ఇలాకా హిందూపురంలో ఘటన
డైజోఫాం వంటి రసాయనాలను కలిపి కల్తీ కల్లు తయారీ
హిందూపురం: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలోని చౌళూరులో బుధవారం కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితుల కథనం మేరకు.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చౌళూరులో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామ పరిసర ప్రాంతాల వారే కాకుండా సరిహద్దులోని కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ఇక్కడికొచ్చి కల్లు తాగుతున్నారు.
బుధవారం కల్తీ కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. గంగాధరప్ప, సిద్ధలింగప్ప, లక్ష్మమ్మ, నరసప్ప, నరసింహులు, కొల్లమ్మ, కల్లూది గంగమ్మ, రత్నమ్మ, కదిరప్ప, ముద్దమ్మ, సుబ్బరాయుడు, అశ్వర్థప్ప, గంగమ్మ తదితరులు కల్లు తాగిన తర్వాత ప్రవర్తనలో మార్పు వచి్చంది. వారిలో వారే మాట్లాడుకోవడం, అనవసరంగా కోపగించుకోవడం వంటివి చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆస్పత్రులకు తరలించారు.

వీరిలో.. కొల్లమ్మ, లక్ష్మమ్మ, సిద్ధలింగమ్మ, నరసప్ప, రత్నమ్మ, గంగమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో ముగ్గురు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనపై ఎక్సైజ్, హిందూపురం రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. డైజోఫాం వంటి రసాయనాలను కలిపి కల్తీ కల్లు తయారు చేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
సైకోటిక్ బిహేవియర్తో వచ్చారు
ఈ ఘటనపై హిందూపురం జిల్లా ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ జీవన మాట్లాడుతూ.. కల్లు తాగిన వారు సైకోటిక్ బిహేవియర్తో వచ్చారని చెప్పారు. ఎవరో వచ్చారు.. తమను ఏదో చేస్తున్నారు.. ఇబ్బందులు పెడుతున్నారంటూ ఏదేదో మాట్లాడుతున్నారని వివరించారు. దుస్తులు కూడా విప్పేసుకుంటున్నట్టు చెప్పారు. వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు.


