హింసించి.. చంపేశారా..?! | - | Sakshi
Sakshi News home page

హింసించి.. చంపేశారా..?!

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

అనంతపురం సెంట్రల్‌: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం గ్రామానికి చెందిన దబ్బర అశోక్‌ (30) అనంతపురంలోని హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి నగ్నంగా కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఆస్పత్రి వారు తెలిపారు.

ఆ రాత్రి ఏం జరిగింది..?

అశోక్‌ను ఆస్పత్రికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఓ వివాహిత భర్త, మరో రౌడీషీటర్‌ కలిసి ఆస్పత్రిలోనే ఓ గదిలో బంధించి.. బట్టలూడదీసి చిత్రహింసలకు గురిచేశారని తెలుస్తోంది. నేరుగా చంపకుండా.. భవనంపై నుంచి దూకి చనిపోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. అయితే అశోక్‌ భవనంపై నుంచి దూకినా స్వల్ప గాయాలే కావడంతో ప్రాణభయంతో పైకిలేచి నడుస్తూ రాగా.. క్షణాల్లో కొందరు వచ్చి ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు ఆస్పత్రిలో ఆ యువకుడి ఊపిరి తీసేశారని తెలిసింది. మృతి చెందిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతుడి బంధువులు వచ్చి ఆందోళన చేసి, డయల్‌ 100కు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడి వీపుపై వాతలు, బలమైన దెబ్బలు ఉండటం కనిపించింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.

ప్రేమాయణమా.. అప్పుల వారి పనా..?

యువకుడి మృతికి ప్రేమాయణం.. లేదా అప్పులే కారణమై ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అశోక్‌ ఓ వివాహితతో వాట్సాప్‌ చాటింగ్‌ చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రేమకు దారి తీసి ఉండవచ్చని, విషయం తెలిసిన తర్వాత అతడి అడ్డు తొలగించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అప్పులు కూడా చేశాడని, వసూలు చేసే క్రమంలో ఇలా చావబాది.. ఊపిరి తీసేశారా అన్న అభిప్రాయమూ వినపడుతోంది.

నిందితులను కాపాడేందుకు ఒత్తిళ్లు..

ఈ కేసులోని నిందితుల్లో హాస్పిటల్‌కు చెందిన ప్రముఖుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధి కుమారుడు, శింగనమల నియోజకవర్గంలోని ప్రముఖ వ్యక్తికి సదరు వ్యక్తి బంధువు. దీంతో అతన్ని కాపాడేందు కోసం అధికార తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది.

త్వరలోనే అన్నీ తెలుస్తాయి

హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ మూడో అంతస్తు నుంచి అశోక్‌ అనే యువకుడు దూకి.. చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం. మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికే కీలకం. ఒత్తిళ్లకు తలొగ్గం. నిబంధనల ప్రకారమే కేసు దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి.

– కౌలుట్లయ్య, సీఐ,

త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌, అనంతపురం

హిత హాస్పిటల్‌లో

యువకుడి మృతిపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement