కుందుర్పి : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కల్యాణి వైన్షాపులకు అనుబంధంగా ఊరూరా బెల్టుషాపులు పెట్టి అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ పేదలను నిలువుదోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని కోరుతూ వారు సోమవారం కుందుర్పిలోని రామస్వామి ఆలయం నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు, ఎంపీపీ నాగరాజు తదితరులు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే అమిలినేని బెల్టుషాపులు పెట్టించి బాటిల్ మద్యంపై రూ.40 అదనంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మద్యానికి బానిసలైన పేదలను ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్న బెల్టుషాపులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో దోచుకున్న సొమ్ముతో కొంత ఖర్చు చేసి సేవ చేస్తున్నట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో చాలాచోట్ల తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోని ఎమ్మెల్యే.. మద్యాన్ని మాత్రం ఏరులా పారిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలాక్షి, ఉపాధ్యక్షుడు భీమప్ప, పార్టీ డివిజన్ మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి, మాజీ సర్పంచులు రామ్మూర్తి, బొమ్మయ్య, శివశంకర్రెడ్డి, వెంకటేష్, ఓబన్న పాల్గొన్నారు.
బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం
తాగునీటి సమస్య తీర్చరు కానీ మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు
వైఎస్సార్సీపీ నాయకుల మండిపాటు


